పోరాడితే పోయేదేంలేదు బానిస సంకెళ్లు తప్ప: జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రిలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ పై దాడిచేసిన ఘటనలో డీఎస్పీ చైతన్యపై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ ముందు బైఠాయించారు. సేవ్ తాడిపత్రి అంటూ నినాదాలు చేశారు. జేసీకి మద్దతుగా టీడీపీ శ్రేణులంతా పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
జేసీ ఆసక్తికర ట్వీట్
ఆందోళన ముగిసిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. పోరాడితే పోయేదేంలేదు బానిస సంకెళ్లు తప్ప.. నాడు సేవ్ తాడిపత్రి నినాదాన్ని మరోసారి గుర్తుచేస్తున్నా!ను అన్నారు. తాడిపత్రిని కాపాడటానికే తాను ఉన్నానని.. కచ్చితంగా కాపాడతానని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్న వీడియోను కూడా ప్రభాకర్ రెడ్డి ట్వీట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో జేసీ వర్గీయులు సేవ్ తాడిపత్రి నినాదాన్ని వినిపించిన సంగతి తెలిసిందే. మరోసారి ఆ నినాదాన్ని తెరపైకి తేబోతున్నట్లు ప్రకటించారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన కాల్వ శ్రీనివాసులు
తాడిపత్రిలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దళిత నాయకులే లక్ష్యంగా వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారని, డీఎస్పీ చైతన్య ప్రోద్బలంతో చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. టీడీపీకి చెందిన దళిత కౌన్సిలర్లను లక్ష్యంగా ఎంచుకొని వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారని, డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. కౌన్సెలింగ్ పేరుతో టీడీపీ నేతలను స్టేషన్ కు పిలిపించి కొడుతున్నారని చెప్పారు.
వెంటవెంటనే జరుగుతున్న దాడులు
రెండురోజుల క్రితం కిందట తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జునపై వైసీపీ గూండాలు దాడి చేసి, తీవ్రంగా కొట్టారని, అడ్డొచ్చిన మల్లికార్జున తల్లీ చెల్లిపై కూడా దౌర్జన్యం చేశారని కాల్వ తెలిపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రోద్బలంతో వీరు గతంలో కూడా దాడికి పాల్పడ్డారని, మళ్లీ 33వ వార్డు కౌన్సిలర్ విజయ్పై దాడి చేశారన్నారు. తాడిపత్రిలో వరుసగా జరుగుతున్న దాడి ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, డీఎస్పీ చైతన్య రాజకీయ దాడులను ప్రోత్సహిస్తున్నారని, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.