గుంటూరులో కూటమి మేయర్ ఖరారు..! వైసీపీకి షాకివ్వడమే లేటు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్థానిక సంస్థలు నడిపే పరిస్ధితి లేకపోవడంతో ఆయా చోట్ల వైసీపీకి షాకులు తప్పడం లేదు. గతంలో అధికారంలో ఉండగా ఏకపక్షంగా స్థానిక సంస్థల్ని గెల్చుకున్న వైసీపీకి ఇప్పుడు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు వరుస షాకులిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా గుంటూరు నగర పాలక సంస్ధలోనూ ఇదే పరిస్ధితి ఎదురైంది.
గుంటూరు నగరపాలక సంస్థలో వైసీపీ ఆధిపత్యానికి తాజాగా గండి పడింది. మొత్తం 56 మంది కార్పొరేటర్లు ఉన్న కౌన్సిల్లో 34 మంది టీడీపీ నేతృత్వంలోని కూటమికి మద్దతు పలికారు. దీంతో మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలోని వైసీపీ కౌన్సిల్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. తాజాగా జరిగిన స్టాండింగ్ కౌన్సిళ్ల ఎన్నికల్లో ఆరుగురు సభ్యుల్ని గెలిపించుకోవడంలో సక్సెస్ అయిన కూటమి పార్టీలు.. ఇప్పుడు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నాయి.

వచ్చే నెల 18కి గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటుంది. దీంతో ఆ తర్వాత ఎప్పుడైనా ప్రస్తుత వైసీపీ మేయర్ కావటి మనోహర్ నాయుడిపై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త మేయర్ ను కూడా ఖరారు చేసేసింది. గుంటూరు నగరపాలక సంస్థ కూటమి మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర నానిని ఖరారు చేస్తూ తాజాగా కూటమి పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.
కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్, కార్పొరేషన్ లో టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్రని మేయర్ అభ్యర్థిగా నిర్ణయించారు. గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా 2019 నుంచి 2024 వరకు పార్టీ పటిష్టతకు రవీంద్ర ఎంతో కృషి చేశారు.
రెండు దశాబ్ద కాలంగా సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ అభివృద్ధికి రవీంద్ర చేసిన సేవలకు ఎట్టకేలకు గుర్తింపు లభించిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా రవీంద్ర పేరు ప్రచారం జరిగినప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో గళ్ళ మాధవికి సీటు కేటాయించారు. అయినా పార్టీ విజయానికి కోవెలమూడి రవీంద్ర కృషి చేశారు. దీంతో ఇప్పుడు ఆయనకు మేయర్ గా అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం కార్పోరేషన్ లో పార్టీల బలాబలాలు చూస్తే మొత్తం టీడీపీకి 32, వైసీపీకి 24 మంది కార్పోరేటర్లు ఉన్నారు. అయితే ఇంకా వైసీపీలో ఉన్న కార్పోరేటర్లు త్వరలో టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. దీంతో మేయర్ పదవి దక్కించుకోవడం కూటమికి నల్లేరుపై నడకే.












Click it and Unblock the Notifications