మా జగ్గాడికి తెలిసింది అదొక్కటే: జగన్పై మాజీ ముఖ్యమంత్రి సోదరుడి సెటైర్లు: ప్యాకేజీ పైనా
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటు కామెంట్లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ పట్ల పలు సందేహాలను వ్యక్తం చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరినీ తప్పు పట్టారు. మా జగ్గాడికి తెలిసింది అదొక్కటే అంటూ సెటైర్లను సంధించారు.
మోడీ ప్యాకేజీకి ఓ లెక్కుంది: ఇక మేడిన్ చైనా వస్తువులకు బ్రేక్: డ్రాగన్ వెన్ను విరిచే స్కెచ్
ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కిశోర్ కుమార్ రెడ్డి.. అనంతరం తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు అంటీముట్టనట్టు ఉంటోన్న ఆయన ఇటీవలే యాక్టివ్గా మారారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తరచూ విమర్శలను గుప్పిస్తున్నారు.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరంలో కోరంగిమడ అడవులను రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం చేస్తోందంటూ వచ్చిన వార్తల పట్ల కిశోర్ కుమార్ రెడ్డి స్పందించారు. వైఎఎస్ జగన్పై వ్యక్తిగత దాడికి దిగారు. వైఎస్ జగన్కు పడగొట్టడం, తొలగించడం, నరకడం, దోచుకోవడం తప్ప మరొకటి తెలియదంటూ ట్వీట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టాలు, అటవీ పరిరక్షణ చట్టాలు, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు... ఇలా ఎన్ని చట్టాలు ఉన్నా లాభం లేదని విమర్శించారు.
చట్టాలను అతిక్రమించి నేరాలు చేసే వాళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు కాకినాడ మడ అడవులను నరికేసి, పూడ్చి పాతరేస్తున్నట్టే నిబంధనలన్నిటినీ పాతరేస్తారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మరల్చడానికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీాఆర్, వైఎస్ జగన్ ప్లాన్ చేశారని, అందుకే కృష్ణా జలాల వివాదాన్ని తెరమీదికి తీసుకొచ్చారని విమర్శించారు. ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఏ ఆర్థిక సంవత్సరం జీడీపీకి సంబంధించినదో తెలియజేయాలని డిమాండ్ చేశారు.
Recommended Video
నోట్ల రద్దు, లాక్డౌన్ వల్ల రోడ్డుపై పడింది పేదలు, మధ్య తరగతి ప్రజలేనని చెప్పారు. ఈ రెండింటిలోనూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఈ 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ సహకారంతో వలస కార్మికులను ప్రాణాలతో స్వస్థలాలకు చేర్చగలరా? అని ప్రశ్నించారు. ఈ ప్యాకేజీని దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి వినియోగిస్తారా? లేక స్వాహాదారులకు అంకితం ఇస్తారా? అని నిలదీశారు.