వైఎస్ జగన్కు నారా లోకేష్ లేఖ: కేసీఆర్, మోడీ సర్కార్తో ముడిపెడుతూ
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల కథ మళ్లీ మొదటికొచ్చింది. సెకెండ్ వేవ్ ప్రభావం అన్ని జిల్లాలపైనా ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు వందల్లో పుట్టుకొస్తున్నాయి. మరణాల సంఖ్యలోనూ అదే తరహా వేగం నెలకొంది. రోజూ వేలల్లోనే కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విజయవాడలోని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఒకరోజు పాటు తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశారు. కరోనా కేసుల ఉధృతిని తగ్గించడానికి ఇలాంటి చర్యలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడానికి ప్రభుత్వం చేస్తోన్న చర్యలు అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ను వాయిదా వేసింది. పొరుగునే ఉన్న తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఇంటర్ పరీక్షలను వాయిదా వేశాయి.

ఏపీ కూడా అదే తరహాలో నిర్ణయాన్ని తీసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో సగటున రోజూ మూడువేల వరకు కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, గత ఏడాది కంటే 30 శాతం మేర వాటి పెరుగుదల ఉందని పేర్కొన్నారు. సెకెండ్ వేవ్లో కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని గుర్తు చేశారు.
Recommended Video
ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహంచడం సరికాదని అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్నందున ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ను వాయిదా వేయాలని నారా లోకేష్.. ముఖ్యమంత్రికి సూచించారు. అనేక రాష్ట్రాలు ఈ దిశగా ఉత్తర్వులను జారీ చేశాయని చెప్పారు. మే-జూన్ మధ్య రాష్ట్రంలో 15 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలను రాయడానికి సిద్ధపడాల్సి ఉంటుందని, పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవని నారా లోకేష్ అన్నారు.












Click it and Unblock the Notifications