గంటల వ్యవధిలో: మోడీకి చంద్రబాబు..స్మృతి ఇరానీకి నారా లోకేష్ లేఖాస్త్రాలు: పునరుద్ధరణ కోసం
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన కొన్ని గంటల వ్యవధిలోనే నారా లోకేష్.. కేంద్రానికి కొత్త ప్రతిపాదనలను పంపించారు. కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి నారా ఆయన లేఖ రాశారు. అఖిల భారత చేనేత మండలిని పునరుద్ధరించాలని విజ్ఙప్తి చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అఖిల భారత చేనేత మండలిని పునరుద్ధరించాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమ చర్యల్లో భాగంగా 1992లో కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి-చేనేతలకు మధ్య ఉన్న ఏకైక వారధి ఆ బోర్డు ఒక్కటేనని పేర్కొన్నారు. అఖిల భారత చేనేత మండలిని రద్దు చేయటం వల్ల చేనేతల అభిప్రాయాలను తెలుసుకునే వీలు లేకుండా పోయిందని చెప్పారు. చేనేత మండలిని రద్దు చేస్తే కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఈ నెల 9వ తేదీన ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సంస్థల క్రమబద్దీకరణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఈ మండలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, చేనేత నిపుణులు, ప్రతినిధులు సభ్యులుగా ఉండేవారు. మండలి తరచూ సమావేశమై చేనేత అభివృద్ధి, సంక్షేమంపై కేంద్రానికి సిఫార్సులు చేసేది. అలాంటి కీలకమైన బోర్డును రద్దు చేయడం వల్ల చేనేత రంగానికి, దాని మీద ఆధారపడి ఉన్న లక్షలాది మంది నేత కార్మికులకు నష్టం కలుగుతుందని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలభారత చేనేత మండలిని రద్దు చేయటం వల్ల చేనేత కార్మికుల అభిప్రాయాలను తెలుసుకునే వీలు లేకుండా పోయిందని అన్నారు.
మండలిని రద్దు చేయడం వల్ల ప్రభుత్వ విధానాలు మొదలుకుని ఆధునికీకరణ కోసం అవసరమైన సలహాలను తీసుకోవడం, మంత్రిత్వ శాఖకు సూచనలు చేయడం ఉండబోదని అన్నారు. దాని ప్రభావం కార్మికులపై తీవ్రంగా పడుతుందని చెప్పారు. కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకునే వ్యవస్థ లేనట్టయిందని చెప్పారు. దీనికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని వెంటనే చేనేత మండలిని పునరుద్ధరించాలని కోరారు. లేదా దానికి సమానమైన వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ కేంద్రమంత్రికి విజ్ఙప్తి చేశారు.