చిత్తం దొర డిపార్టుమెంట్ సిఐడీ; స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పై కుట్ర; ఆధారాలున్నాయన్న పట్టాభి
టిడిపి నేత పట్టాభి వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ కుట్రలకు తెరతీశారని, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పై బురద జల్లి లక్షలాది మంది యువత భవితను చీకటిమయం చేసేలా సిఐడి వ్యవహరిస్తోందని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపణలు గుప్పించారు. జగన్ చేతిలో సీఐడీ కీలుబొమ్మగా మారిందని సిఐడిని అడ్డం పెట్టుకొని వైసిపి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

తాడేపల్లి పెద్దల అడుగులకు మడుగులొత్తే చిత్తం దొర డిపార్టుమెంటు సిఐడీ
తాడేపల్లి పెద్దల అడుగులకు మడుగులొత్తే చిత్తం దొర డిపార్ట్మెంట్ గా సిఐడి మారిందని చెప్పడం నూటికి నూరు శాతం వాస్తవం అని పట్టాభి పేర్కొన్నారు. జగన్ ఏం చెప్పినా చిత్తం దొర అంటున్నారని మండిపడ్డారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన పట్టాభి సీమెన్స్ ప్రాజెక్టు వ్యవహారంలో సిఐడి అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మొత్తం పచ్చి బోగస్ అంటూ నిప్పులు చెరిగారు. సీమెన్స్, డిజైన్ టెక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలకు ఎలాంటి పరికరాలు సరఫరా చేయకుండా కోట్లాది రూపాయలు దోచుకున్నది అంటూ సిఐడి చేసిన ఆరోపణలు పచ్చి అబద్దమని టిడిపి నేత పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ అధినేతపై బురద పూసే కుట్రలో భాగమే ఇదంతా
అన్ని సక్రమంగా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు సంతకాలు చేసిన రిజిస్టర్లు ఉన్నాయని, అలాంటప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి ఎలా ఫిర్యాదు చేస్తారంటూ పట్టాభి నిలదీశారు. తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పైన బురద చల్లాలని, అవినీతి మసి పూయాలి అన్న ఉద్దేశ్యంలో భాగంగా, కక్షసాధింపు చర్యలకు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని పట్టాభి అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వానికి సిఐడి తోలుబొమ్మగా మారి వారు చేస్తున్న కుట్రలకు సహకారం అందిస్తుందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ప్రారంభించిన గొప్ప ప్రాజెక్టుకు అవినీతి మరక అంటించి అటకెక్కించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
సిఐడీ చెంచా డిపార్టుమెంటు గా మారింది
సిఐడి చెంచా డిపార్ట్మెంట్ గా మారిందని అసహనం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా లక్ష్మీనారాయణ, సుబ్బారావు లను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సిఐడి అధికారులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో ఎలాంటి అవినీతికి సంబంధించిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ లో అవాస్తవాలు నమోదు చేశారని వెల్లడించారు. వైసీపీ పెద్దల కోసం సిఐడి అధికారులు పనిచేయడం దారుణమని మండిపడ్డారు. ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పడానికి తమ వద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయని వాటన్నింటినీ ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు.

అధికారులు అంతా పక్కాగా ఉందని సంతకాలు చేస్తే చైర్మన్ ఫిర్యాదు ఎలా చేశారని ప్రశ్న
తమ ప్రభుత్వ హయాంలో యువతకు ఉపాధి కల్పించడానికి చేసిన ప్రాజెక్టు పై కావాలని ప్రస్తుత ప్రభుత్వం అవినీతి మరక అంటించే ప్రయత్నం చేస్తోందని పట్టాభి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నడిచిన 40 కాలేజీలలో సిమెన్స్, డిజైన్ టెక్, వారికి కావలసిన పరికరాలను సరఫరా చేశారని, స్టాక్ రిజిస్టర్ లో అన్నీ ఉన్నట్టుగా అటు కళాశాలల యాజమాన్యం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సంతకాలు చేశారని, అలాంటప్పుడు ఇప్పుడు అసలు పరికరాలు సప్లై చేయలేదని ఎలా అంటారు అంటూ నిలదీశారు. దీనికి సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. సిఐడీ కన్నింగ్ స్కిల్స్ కు కేరాఫ్ గా మారిందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications