టీడీపీ -జనసేన కలిస్తే 160 సీట్లు : ఒంటరిగా వెళ్తే ఇవే - జగన్ ను ఓడించాలంటే : టీడీపీ నేత సంచలనం..!!
ఏపీలో ముందస్తుగానే ఎన్నికల మూడ్ మొదలైంది. వచ్చే ఎన్నికల పైన పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. ఒక వైపు సీఎం జగన్ తన ఎమ్మెల్యేలను ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ - పార్టీ పరంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలతో రానున్న ఎన్నికల పైన మరింతంగా చర్చ మొదలైంది. ప్రతిపక్ష టీడీపీ తిరిగి 2014 తరహా పొత్తులు కోరుకుంటుందనే చర్చ మొదలైంది.
Recommended Video
గతంలో కుప్పం కేంద్రంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనతో పొత్తు పైన చేసిన వ్యాఖ్యలకు పవన్ నుంచి వచ్చిన స్పందన ఆ పార్టీ నేతలకు రుచించ లేదు. చంద్రబాబు తాము జనసేనతో పొత్తు కు సిద్దమే అనే విధంగా ఒన్ సైడ్ లవ్ ఉంటే కదరదని..రెండు వైపులా ఉండాలని వ్యాఖ్యానించారు.
పవన్ వ్యాఖ్యల పై వ్యూహాత్మక మౌనం
దీనికి ప్రతిగా పవన్ మైండ్ గేమ్ ఆడుతున్నాని..పొత్తుల పైన త్వరలోనే క్లారిటీ ఇస్తానని అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇక, తాజా పార్టీ సభలో బీజేపీ తనున వైసీపీని ఓడించేందుకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పిందని..ఆ తరువాత పొత్తుల పైన నిర్ణయం ఉంటుందని పవన్ స్పష్టత ఇచ్చారు. అయితే, అదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు మాత్రం చీలనివ్వనని చెప్పుకొచ్చారు.
ఆ వ్యాఖ్యల ద్వారా జనసేన పరోక్షంగా టీడీపీతో పొత్తు ఖాయమనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. దీని పైన టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జనసేనతో తాము పొత్తు కోరుకుంటున్నట్లుగా ఎక్కడా బయట పడటం లేదు. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం వచ్చే ఎన్నికల్లో బీజేపీ - జనసేన కలిసి పోటీ చేస్తామని చెబుతూ..టీడీపీ గురించి మాత్రం ప్రస్తావించటం లేదు.
జనసేనతో కలిస్తే..సీట్ల లెక్కలు ఇలా
ఇదే సమయంలో టీడీపీ ముఖ్యనేత.. అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ లీడర్ నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు స్పష్టం చేసారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు వచ్చి ఓడిపోయినా 40 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేసారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం వెంపర్లాడకుండా .. ప్రజల తరపున ప్రభుత్వం పై పోరాటం చేయాలన్నారు. ఏ పార్టీ ముందుకొస్తుందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచే జనసేనతో పొత్తు.. బీజేపీతో పొత్తు అనే చర్చ ఎందుకని పేర్కొన్నారు.
అయితే, ఇప్పుడున్న లెక్కల ప్రకారం టీడీపీ - జనసేన కలిస్తే 150 నుంచి 160 సీట్లు వస్తాయని రామానాయుడు చెప్పుకొచ్చారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 100 -110 సీట్లు వస్తాయని లెక్కలు కట్టారు. దీనికి కొనసాగింపుగా ఆయన కాపు ఓటింగ్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
టీడీపీ తో బీజేపీ కలుస్తుందా
కాపులు అందరినీ కలుపుకొని వెళ్లాలని పేర్కొన్నారు. అప్పుడే విజయం సాధిస్తారని స్పష్టం చేసారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 50 శాతం ఓట్లు సాధించి 151 ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంది. 175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఏపీ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే 88 సీట్లు గెలవాల్సి ఉంది. అయితే, ఇప్పుడు టీడీపీ సొంతంగా పోటీ చేస్తే 100 సీట్లు నుంచి 110 సీట్లు వస్తాయని చెప్పటం ద్వారా టైట్ ఫైట్ ఉంటుందనే అంశాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు.
2014 ఎన్నికల్లో 1.95 శాతం ఓట్ల తేడాతో వైసీపీ అధికారం కోల్పోయింది. అయితే, ఇప్పుడు జనసేన బీజేపీతో మైత్రి కొనసాగిస్తోంది. బీజేపీ ఎక్కడా జనసేనతో దూరం అవుతామనే అంశం చెప్పటం లేదు.
జగన్ ప్రతివ్యూహాలతో సిద్దం
అదే సమయంలో జనసేన సైతం బీజేపీతో పొత్తు వీడి..టీడీపీతో కలుస్తామంటూ నేరుగా చెప్పేందుకు సమయం కోసం వేచి చూస్తోంది. ఇక.. బీజేపీ - టీడీపీ కలుస్తాయా.. తిరిగి బీజేపీ - టీడీపీ - జనసేన కలిసి జగన్ కు వ్యతిరేకంగా కూమటి కడుతాయా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. బీజేపీ అధినాయకత్వం ఇంకా టీడీపీతో కలిసి పని చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.
అయితే, 2014 లో జనసేన అధినేత మద్దతు ప్రకటించినా.. ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ, ఇప్పుడు పొత్తుతో ముందుకెళ్తే సీట్లు పంపకం సైతం కీలకం కానుంది. దీంతో..వచ్చే ఎన్నికల కోసం చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతున్నాయి.