‘జగన్ను నమ్మితే బిర్యాని కాదు.. జైలులో చిప్పకూడే’
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ను నమ్మితే బిర్యాని కాదు కదా.. జైలు చిప్పకూడు తినిపిస్తారని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన చేసి నేర పరిశోధన సంస్థలకు దొరికిపోయి ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామిక వేత్తలను తనతో పాటు జైలుకు పంపించిన ఘనత జగన్దేనని దుయ్యబట్టారు.
ఆయన టీడీపీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ.. 'సొంత తల్లిపై పోటీ చేసిన చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపి బిర్యానీ పెడతా... నాలుగు రెట్ల సంపాదన చూపిస్తా'నంటూ అమాయకులైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వంచించేందుకు జగన్ జిల్లాలో పర్యటించారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
పైడిపాళెంకు నీరొచ్చాక తెలంగాణ వదిలి నింపాదిగా కడప జిల్లాలోని ప్రాజెక్టు వెళ్ళి మా తండ్రి పూర్తి చేశారని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇటువంటి ప్రతిపక్ష నేత.. జిల్లా వాసి కావడం ప్రజల దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు.

ఈ ఎన్నికలలో ఆయన చిన్నాన్న ఓడిపోవడం తధ్యమని గ్రహించి స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులతో రెండేళ్ళల్లో ముఖ్యమంత్రి అవుతానని.. అప్పుడు నాలుగు రెట్ల సంపాదన చూపిస్తానని చెబుతూ వారిని అన్యాయం చేసేందుకు కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
నీటి పారుదల అభివృద్ధి బోర్డు సమావేశాలకు గానీ, చివరకు జిల్లా పరిషత్ సమావేశాలకు కూడా హాజరు కాని జగన్.. నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు వల్లే పులివెందులకు సాగు నీరు వస్తున్న సంగతి ముమ్మాటికీ వాస్తవమని తెలుసుకున్న ప్రజలు.. జగన్ పార్టీని భూస్థాపితం చేస్తారన్నారు.












Click it and Unblock the Notifications