బొబ్బిలి రాజా తిరిగి వైసీపీలోకి..!! వద్దంటున్న ఆ మంత్రి- అశోక్ గజపతిని దెబ్బ తీయాలంటే..!!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో భారీ ట్విస్టులు మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీకి మంచి పట్టు ఉన్న విజయ నగరం జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం పది స్థానాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఎంపీ స్థానం వైసీపీ గెలుచుకుంది. ఇక, సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న అశోక్ గజపతి రాజును ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడించింది. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఛైర్మన్ గా ఉన్న మాన్సాస్ ట్రస్టు మొదలు సింహాచలం- రామతీర్ధం వంటి దేవాయాల నుంచి ఆయన్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
వైసీపీ వర్సెస్ అశోక్ గజపతి..
ఆ హోదాను సంచయితకు కట్టబెట్టటం..తరువాత కోర్టు ఆదేశాలతో తిరిగి అశోక్ గజపతి రాజు ఛైర్మన్ అవ్వటం చోటు చేసుకుంది. ఇదే సమయంలో కొందరు క్షత్రియ సంఘాల పేరుతో అశోక్ గజపతి రాజు పైన వ్యవహరిస్తున్న తీరును తప్పు బడుతూ పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ఇక, మాన్సస్ ట్రస్టులో ప్రభుత్వం ఆడిటివ్ నిర్వహిస్తోంది. దీంతో..అక్కడ ఒక రకంగా వైసీపీ వర్సస్ అశోక్ గజపతి రాజు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక, అశోక్ ను పూర్తిగా దెబ్బ తీయాలంటే జిల్లాలో రాజుల కుటుంబానికి చెందిన వారిని తిరిగి పార్టీలో ఉండాలనే అభిప్రాయం కొందరు సీనియర్లు వ్యక్తం చేసారు.
వైసీపీలోకి బొబ్బిలి రాజుల రీ ఎంట్రీ..
ఇదే సమయంలో...గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి..2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన బొబ్బిలి రాజులు తిరిగి వైసీపీలోకి వచ్చేలా ఆసక్తి చూపుతున్నారు. దీనికి ఇప్పటి వరకు వైసీపీ ముఖ్య నేతల నుంచి స్పష్టత రాలేదు. అయితే, అశోక్ గజపతి రాజు టీడీపీలో ఉండగా..తమకు ప్రాధాన్యత దక్కదని .. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు సైతం అమలు కాకపోవటంతో ..వైసీపీలోకి రావటమనే భావనలో బొబ్బిలి రాజులు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే, ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూస్తున్న వైసీపీ ముఖ్య నేత ద్వారా ఇందు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.
పూసలపాటి వర్సెస్ బొబ్బిలి రాజులు
కాంగ్రెస్ నుంచి 2009 లో బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచిన సుజయ కృష్ణ రంగారావు జగన్ కు మద్దతుగా వ్యవహరించటంతో అనర్హత వేటు పడి.. వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బొబ్బలి రాజులకు అటు పూసలపాటి వారితో చారిత్రక వైరం కూడా తమకు కలిసి వస్తుందని వైసీపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే అంశం పైన సీఎంతో చర్చించటానికి సిద్దం అవుతున్నారు.
సీనియర్ మంత్రి అడ్డుగా నిలుస్తారా..
అయితే, తొలి నుంచి జిల్లాకు చెందిన సీనియర్ నేతతో ఉన్న వైరం..ఆయనకు పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యత..హోదా కారణంగానే బొబ్బిలి రాజులు వైసీపీలోకి రావటానికి ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు మరో వాదన. ఇదే సమయంలో ఆ మంత్రి సైతం బొబ్బలి రాజులు పార్టీలోకి రావటానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. తమ మీద ఆ మంత్రి పెత్తనం లేకుండా ఉంటే..తాము వైసీపీలోకి వస్తామనే ప్రతిపాదన రావటం... పార్టీకి చెందిన ముఖ్య నేత ఈ మేరకు కార్యాచరణ సిద్దం చేయటం కొనసాగుతోంది.
Recommended Video
సీఎం జగన్ ఫైనల్ డెసిషన్..
అయితే, దీని పైన ముఖ్యమంత్రి జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో సుజయ రంగారావు తన ప్రాణం ఉన్నంత వరకూ జగన్ తోనే ఉంటానని..పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పిన కొద్ది రోజులకే టీడీపీలోకి ఫిరాయించటాన్ని అప్పట్లో జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో బొబ్బిలి నుంచి శంబంగి వెంకట చిన అప్పల నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత బొబ్బిలి రాజా సైలెంట్ అయిపోయారు. ఇక, ఇప్పుడు ఆ మంత్రి అభ్యంతరం తొలిగించేందుకు కీలక నేత ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, సీఎం జగన్ ఆమోదం తెలిపితే బొబ్బిలి రాజులు తిరిగి వైసీపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది.