వార్డు వలంటీర్లను చితగ్గొట్టిన టీడీపీ కార్యకర్తలు: గర్భంతో ఉన్నదని కూడా కనికరించలేదు.. !
విజయవాడ: రాష్ట్రంలో గ్రామ, వార్డు వలంటీర్లపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఇదివరకు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వలంటీర్లపై దాడులు చోటు చేసుకుంది. తాజాగా మరో ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కొందరు కార్యకర్తలు మచిలీపట్నం తొమ్మిదో వార్డు సచివాలయం వద్దే వార్డు వలంటీర్లపై దాడికి పాల్పడ్డారు. మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో వార్డు వలంటీర్లు గాయపడ్డారు.
వైసీపీకి ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో..
ఓటరు గుర్తింపు కార్డులను వలంటీర్లు పంచుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారనేది టీడీపీ నాయకుల ఆరోపణ. ప్రభుెత్వపరంగా విధులను నిర్వర్తించాల్సిన వలంటీర్లు.. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేస్తున్నారనే కారణం మీద ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదైంది.
రేషన్ కార్డు గురించి ఆరా తీయడాన్ని వ్యతిరేకిస్తూ..
తొమ్మిదో వార్డు సచివాలయంలో పని చేస్తోన్న వలంటీర్లు ఆదివారం సాయంత్రం తమ విధి నిర్వహణలో భాగంగా వార్డు పరిధిలో, తమకు కేటాయించిన నివాసాల వద్దకు వెళ్లారు. ఆ నివాసాల్లో కొన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులకు చెందినవి ఉన్నాయి. రేషన్ కార్డు గురించి ఆరా తీశారు. రేషన్కార్డు గురించి సర్వే చేపడుతున్నామని, గులాబీ లేదా తెలుపు రంగు కార్డు గురించి ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉందని, వాటిని చూపించాలని విజ్ఙప్తి చేశారు.
నిబంధనల ప్రకారమే సర్వే చేస్తున్నామని
దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరాకరించారు. ఎందుకు చూపించాలంటూ ఎదురు తిరిగారు. కొద్దిసేపటి తరువాత వారంతా మూకుమ్మడిగా వార్డు సచివాలయం వద్దకు వెళ్లి, అక్కడి ఉద్యోగులను ఇదే విషయంపై నిలదీశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాము రేషన్ కార్డు గురించి విచారణ నిర్వహిస్తున్నామని, తమకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ- టీడీపీ కార్యకర్తలు వినిపించుకోలేదు. వాగ్వివాదానికి దిగారు. వలంటీర్లు, టీడీపీ కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగింది.
గర్భంతో ఉన్న వలంటీర్పైనా
తమ ఇంటికి రేషన్కార్డు గురించి విచారణకు వచ్చిన వార్డు వలంటీర్పై వారు దాడికి దిగారు. కర్రలతో చితకబాదారు. విడిపించడానికి వెళ్లిన మహిళా వలంటీర్నూ వదల్లేదు. ఆమెపైనా దాడికి పాల్పడ్డారు. తాను గర్భంతో ఉన్నానని చెబుతున్నప్పటికీ వినిపించుకోలేదు. అడ్డుగా వస్తోన్న ఆమెను లాగి పడేశారు. స్థానికులు జోక్యం చేసుకోవడంతో ఈ ఘటన సద్దుమణిగింది. తమపై దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై వార్డు సచివాలయం ఉద్యోగులు, వలంటీర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.