ఏపీలో వరుస కేసులతో టీడీపీ బెంబేలు- జగన్ పేరెత్తాలంటేనే నేతలకు దడ
ఏపీలో స్ధానిక ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలో విపక్ష టీడీపీ నేతలను వరుస కేసులు ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. గత ప్రభుత్వంలో వివిధ రూపాల్లో జరిగిన అవినీతిపై జగన్ సర్కారు వరుస విచారణలకు ఆదేశిస్తుండటం వారిలో కలకలం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వరుస ఆరోపణలపై విరుచుకుపడిన వారంతా ఇప్పుడు తమ స్వరాల్ని సవరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఫైర్ బ్రాండ్ నేతలు, వారిపై నమోదైన కేసులను ఓసారి పరిశీలిద్దాం..

అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్- పుల్లారావు, నారాయణ
అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణపై ఇప్పటికే సీఐడీ కేసులు నమోదు చేయగా త్వరలో ఈడీ విచారణ కూడా ప్రారంభం కానుంది. టీడీపీ హయాంలో అమరావతి ప్రాంతంలో అంతా తామే అయి చక్రం తిప్పిన వీరిద్దరూ ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులతో బయటికి కనిపించడమే మానేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో పుల్లరావు కాస్త హంగామా చేసినా ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయారు.

అచ్చెన్నాయుడు, ఈఎస్ఐ స్కాం
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న 151 కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కాం లో తన పేరు ప్రస్తావనకు రావడంతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సైలెంట్ అయిపోయారు. లిస్ట్ లో లేని కంపెనీలకు మందుల కొనుగోలు కాంట్రాక్టు ఇవ్వాలని ఆయన సూచించనట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. దీంతో ఆయన కొద్ది కాలంగా ఈ వ్యవహారంపైనే కాదు ఏ అంశంపైనా విమర్శలు చేయడం లేదు.

జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మంత్రి
టీడీపీ హయాంలో అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలోనూ ఓ రేంజ్ లో చెలరేగిపోయిన మాజీ మంత్రి దివాకర్ రెడ్డి కుటుంబానికి వైసీపీ అధికారంలోకి రావడంతోనే కష్టాలు మెదలయ్యాయి. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సులను పదుల సంఖ్యలో రవాణాశాఖ సీజ్ చేసింది.
అటు జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మరో ఇద్దరు నిందితులను తాడిపత్రి పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు నలుగురు జేసీ ట్రావెల్స్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లయింది. సీఐలు, ఎస్సైలు, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్ యాజమాన్యం ఆదేశాలతోనే నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు.
తాడిపత్రి ఎస్ఐ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు పోలీస్స్టేషన్కు సంబంధించిన నకిలీ స్టాంపులు వినియోగించినట్లు విచారణలో బయటపడింది. నకిలీ పత్రాలతో 6 లారీలను జేసీ ట్రావెల్స్ బెంగుళూరులో విక్రయించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డి జేసీ ట్రావెల్స్ ఎండీగా వ్యవహరిస్తున్నారు.

కుటుంబరావు, ప్రణాళికాసంఘం మాజీ ఉపాధ్యక్షుడు
గత టీడీపీ ప్రభుత్వంలో అప్రతిహతంగా చక్రం తిప్పిన రాష్ట్ర్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు కుటుంబం విజయవాడ కబ్జా చేసిన 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తాజాగా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన స్థలానికి కుటుంబరావు సోదరుడు పెట్టిన బోర్డులను అధికారులు తొలగించారు. గత టీడీపీ హయాంలో కుటుంబరావు కుటుంబీకులు రూ.200 కోట్లకు పైగా విలువ గల ప్రభుత్వ భూమిని చేజిక్కించుకున్నారు. న్యాయస్థానాలకు వాస్తవాలు చెప్పకుండా వివిధ శాఖలను మేనేజ్ చేసి భారీగా లబ్ధి పొందిన విషయం ఇటీవల ‘స్పందన' కార్యక్రమానికి అందిన ఫిర్యాదుల ద్వారా వెలుగు చూసింది. కలెక్టర్ ఆదేశాలతో రికార్డులు పరిశీలించి విచారణ జరిపినట్లు జేసీ మాధవీలత తెలిపారు.

చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే
టీడీపీ హయాంలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ కులం పేరుతో దూషించారని నియోజకవర్గంలోని దళితులు ఆయనపై ఫిర్యాదు చేశారు... దీంతో చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుుకు పంపారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ పై 52 కేసులు ఉన్నాయి. ఇందులో ఏదో ఒక కేసులో పోలీసులు ఆయన్ను స్టేషన్ కు పిలిపించి విచారించడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం, బెయిల్ పై తిరిగి రావడం జరుగుతూనే ఉన్నాయి.

కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే
టీడీపీ హయాంలో విప్ గా వ్యవహరించిన ఆముదాల వలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ స్ధానికంగా ప్రభుత్వ ఉద్యోగులను అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలో రెండు కేసులు ఎదుర్కొంటున్నారు. కూన రవికుమార్పై 353, 306, రెడ్ విత్ 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కూనతో పాటు ఆయన అనుచరుడుు మాజీ ఎంపీటీసీ బొంగు వెంకటరత్నంపై కూడా ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది.

పంచుమర్తి అనురాధ, టీడీపీ అధికార ప్రతినిధి
టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న విజయవాడ మాజీ మేయర్, బీసీ నేత పంచుమర్తి అనురాధ కుటుంబ సభ్యులపై నగరంలో కబ్జా కేసు నమోదైంది. విజయవాడ నడిబొడ్డున వేద పాఠశాల ఏర్పాటు చేయాలన్న శ్రీ కాంచనపల్లి కనకాంబ ట్రస్టు ఆశయాన్ని తుంగలో తొక్కుతూ అనురాధ కుటుంబానికి చెందిన ప్రసాదరావు తుంగలో తొక్కి, భూమిని కబ్జా చేసిన విషయం ఇటీవల బట్టబయలైంది. ఆక్రమించుకున్న భూమిలో ఏకంగా షెడ్డు వేసి, ఫ్యాక్టరీ కూడా కట్టేయడం కలకలం రేపింది. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న లబ్బీపేటలో దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల విలువ చేసే ట్రస్టు భూముల్లో
కొంత భాగం చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. అప్పట్లో మేయర్గా ఉన్న అనురాధ కుటుంబ సభ్యులు ఈ ట్రస్టు భూములను అక్రమ మార్గంలో చేజిక్కించుకున్నారు. ట్రస్టు పేరిట ఉండే భూమిని ట్రస్టుకు ఏ సంబంధం లేని వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్టు రికార్డులు సృష్టించి, ఆ భూమిలో పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు.
అవి కనకాంబ ట్రస్టు భూములే..
ట్రస్టు నిర్వహణ వ్యవహారాలు 2016లో తిరిగి దేవదాయ శాఖ అధీనంలోకి వచ్చాయి. ట్రస్టు భూముల్లో టీడీపీ నేతలు పరిశ్రమను ఏర్పాటు చేసిన విషయం గోప్యంగా ఉండిపోయింది. గతేడాది జూలైలో ఈ కబ్జా వ్యవహారం వెలుగులోకి రావడంతో దేవదాయ శాఖ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఆ భూములు శ్రీకాంచనపల్లి కనకాంబ ట్రస్టువేనని స్పష్టంగా దేవదాయ శాఖ వద్ద రికార్డులు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకోవాలని ట్రిబ్యునల్.. విజయవాడ అసిస్టెంట్ కమిషనర్, ట్రస్టు ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్లో తీర్పు వెలువరించినప్పటికీ, తీర్పు కాపీ జనవరి 30న దేవదాయ శాఖకు చేరింది.
దీంతో ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు దేవదాయ శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోలవరం నిధుల దుర్వినియోగం, అవినీతి వ్యవహారాల్లో మరో మాజీ మంత్రి దేవినేని ఉమ పాత్ర ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న లీకులతో ఆయన కూడా ఆందోళనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications