తల్లే భరించలేదు, వైయస్ సరిగా పెంచలేదు: జగన్పై టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చెప్పుతో కొట్టాలని వైసీపీ అధినేత జగన్ చెప్పడంపై తెలుగుదేశం పార్టీ నేతలు గుర్రుమంటున్నారు. జగన్ పైన ఒకరిని మించి మరొకరు దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్కు రోజులు దగ్గరపడ్డాయని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. త్వరలోనే జగన్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమని చెప్పారు. ఇప్పటికే రూ.43వేల కోట్ల విలువ చేసే జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని గుర్తు చేశారు. పుట్టుకతో నేర చరిత్ర ఉన్న జగన్కు బాబును విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.
జగన్ దవడపళ్లు రాలుతాయి: పయ్యావుల
జగన్ మతితప్పి మాట్లాడుతున్నారని, ఇంట్లో వారు తరిమేస్తే ఊరిమీద పడినట్లు ఆయన తీరు ఉందని పయ్యావుల కేశవ్ అన్నారు. మానసిక వైకల్యం ఉండబట్టే జగన్ను బెంగళూరులో ఉంచారని చెప్పారు. జగన్ వ్యక్తిత్వాన్ని భరించలేక తల్లి సైతం ఆయన చెల్లెలి దగ్గరకే వెళ్లిపోయిందన్నారు.
ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ప్రతిపక్ష నేత కావడం దురదృష్టకరమని చెప్పారు. జగన్ సానుభూతితో నాయకుడు అయితే, చంద్రబాబు మంచితనంతో మనుగడ సాగిస్తున్నారన్నారు. జైలుకు వెళ్లి వచ్చినా జగన్ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.
ప్రస్తుతం జగన్ డిప్రెషన్లో ఉన్నాడన్నారు. త్వరలో కోమాలోకి వెళ్లిపోతాడన్నారు. రెక్కలూడిన వైసిపిని ఓఎల్ఎక్స్లో అమ్మేయాలని ఎద్దేవా చేశారు. మహిళలు చీపుర్లతో, వృద్ధులు చేతికర్రలతో, రైతులు రాళ్లతో, యువకులు బట్టలూడదీసి జగన్ను ఏపీ పొలిమేర దాకా తరిమి కొడతారన్నారు. బాబు మంచితనం వల్లే జగన్ బతికిపోయాడన్నారు.
జగన్కు పిచ్చి పట్టింది: పల్లె
జగన్కు పిచ్చి పట్టిందని, అందుకే గౌరవప్రదమైన హోదాలో ఉన్న చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. అహంకారంతో తండ్రి వయస్సున్న చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష హోదాకు అనర్హుడన్నారు.
తాత వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారన్నారు. జగన్లో అసహనం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఏపీని ఆత్మహత్యలాంధ్రప్రదేశ్గా మార్చిన వ్యక్తి వైయస్ అన్నారు. రైతుల విషయంలో బాబు గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. 2014లోనే జగన్ను ప్రజలు చెంపపై కొట్టారన్నారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమని చెప్పారు. బాబును చెప్పుతో కొట్టాలన్న జగన్ వ్యాఖ్యలపై టిడిపి నేతలు భగ్గుమంటున్నారు.
జగన్ మానసిక పరిస్థితి బాగా లేకనే అలా మాట్లాడుతున్నారని మంత్రి పీతల సుజాత అన్నారు. జగన్ను తల్లిదండ్రులు అలా పెంచారని వ్యాఖ్యానించారు. గాలి ముద్దుకృష్ణమ మాట్లాడుతూ.. జగన్ నిరాశలో ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. విచక్షణ మరిచి పిచ్చిమాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు.
జగన్ను సరిగా పెంచలేదు: సోమిరెడ్డి
వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు జగన్ను సరిగా పెంచకపోవడమేనని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేసుల విచారణ పూర్తయితే ప్రజలు ఎవరిని కొడతారో తెలుస్తుందన్నారు. 13 కేసుల్లో జగన్ ముద్దాయి అని మండిపడ్డారు.
జైల్లో ఉ్న జగన్ను ప్రజలు చెప్పులతో కొట్టి 2014లోనే పక్కన పెట్టారని బోండా ఉమ అన్నారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది అన్నారు. ఇప్పటికైనా జగన్ మారకపోతే ప్రజలు ఆయనను బహిష్కరిస్తారని చెప్పారు. చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణలు చెప్పాలన్నారు.