రేవంత్ ఇష్యూలో ఏసీబీ వద్ద బాబుపై పక్కా ఆధారాలు: టీడీపీ ఫైర్, జగన్పై దేవినేని
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో అరెస్టైన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డితో పాటు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు చెందిన ఆధారాలు ఉన్నాయన్న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పైన తెలంగాణ టీడీపీ నేతలు బుధవారం భగ్గుమన్నారు.
నాయిని వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని చెప్పారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, నర్సారెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు విలేకరులతో మాట్లాడారు.
ఈ వ్యవహారమంతా కుట్ర ప్రకారం జరుగుతోందని మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు రహస్య మిత్రులన్నారు. రేవంత్ వీడియోలు కొన్ని చానళ్లకే ముందుగా బహిర్గతం చేయడం పైన విచారణ జరపాలన్నారు.
కేవలం మూడు ఎమ్మెల్సీ స్థానాలే గెలిచే బలమున్న తెరాస ఐదు స్థానాలు ఎలా గెలిచిందో చెప్పాలన్నారు. తెలంగాణలో ఏ సమస్య పైనా గవర్నర్ను కలవని జగన్మోహన్ రెడ్డి... చంద్రబాబు పైన ఫిర్యాదు చేసేందుకు మాత్రం దురుద్దేశ్యపూర్వకంగా కలిశారన్నారు.
కుమ్మక్కు రాజకీయాలు: దేవినేని
తెరాసతో కుమ్మక్కై జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విజయవాడలో అన్నారు. తెలంగాణ ప్రాంతంలో దోచుకున్న డబ్బులు కాపాడుకునేందుకు తెరాసతో జగన్ చేతులు కలిపారన్నారు. జగన్ చేస్తున్న కుట్ర రాజకీయాలు తమ వద్ద పనికి రావన్నారు.
13 సీబీఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ ఎవరిని మోసం చేయాలని దీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై ప్రశ్నించే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. రైతు పక్షాన పోరాడుతున్న టీడీపీపై విమర్శలు చేసే హక్కు జగన్కు లేదన్నారు.
డ్వాక్రా మహిళల రుణాలు ప్రభుత్వం భరిస్తుంటే చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. అమరావతి ప్రాంత రాజధానిగా రెండు జిల్లాల సర్వతోముఖాభివృద్ధికి రైతాంగం సహకరిస్తోందన్నారు. దేశ చరిత్రలో ఇంత పెదద్ ఎత్తున భూసమీకరణ జరిగిన పరిస్థితి లేదని దేవినేని చెప్పారు.
కాగా, లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారం నేపథ్యంలో రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు.
ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఫోన్ సంభాషణలు ఏసీబీ అధికారుల వద్ద ఉన్నాయని చెప్పారు.
ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ప్రధాన సూత్రధారి చంద్రబాబు సూచన మేరకే రేవంత్ బేరం ఆడారన్నారు. రేవంత్ వ్యవహారంతో రాష్ట్ర రాజకీయాలు తారుమారు అవుతాయన్నారు. త్వరలో అన్ని ఆధారాలు బయటపెడతామన్నారు.