పవన్ ఆరోపణలు నిరాధారం:మంత్రి నక్కా...విజయసాయిరెడ్డిపై పోటీకి సై:ఎమ్మెల్సీ బుద్దా
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ ప్రభుత్వంపై చేసేవన్నీ నిరాధార ఆరోపణలేనని మంత్రి నక్కా ఆనందబాబు తేల్చేశారు. పవన్ కల్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని, 2009 నుంచీ ఉన్నారని వ్యాఖ్యానించారు.
2014 ఎన్నికల్లో జనసేన పోటీచేసినా టిడిపికి ఇబ్బందేమీ ఉండేది కాదన్నారు. కేంద్రంపై పోరాటం చేస్తేనే హోదా వస్తుందని పవన్ కళ్యాణ్ కు మంత్రి నక్కా ఆనందబాబు సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరుచేసిన రూ.15 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మరో నలుగురు లబ్దిదారులకు చంద్రన్న భీమా బాండ్లు అందజేశారు.
మరోవైపు టిడిపి తన వల్లే ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును చూసే ప్రజలు ఓట్లేశారన్నారు. అమిత్ షా దర్శకత్వంలో ప్రస్తుతం నాలుగు పార్టీల అధ్యక్షులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక వైసిపి నేత విజయసాయిరెడ్డి దండుపాళ్యం బృందానికి నాయకుడని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే విజయసాయి రెడ్డిపై విశాఖలో పోటీచేసి ఆయనను 2.2లక్షల ఓట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిస్తానని బుద్ధా వెంకన్న ఛాలెంజ్ చేశారు. విజయసాయిరెడ్డి పప్పులు తమ వద్ద ఉడకవన్నారు. రఘువీరా రెడ్డి, జగన్, కన్నా వీళ్లంతా ఒక్క తానులోని ముక్కలేనని అన్నారు.
జనసేన అధ్యక్షుడు చేపట్టిన బస్సుయాత్రలో తాను ముఖ్యమంత్రిని అవుతానని, 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చేసిన వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. సీఎం అవుతానని పవన్ చేస్తున్న వ్యాఖ్యలు...అన్నప్రాసన రోజే ఆవకాయ తింటాను అన్నట్లుందని అవహేళన చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. నరేంద్ర మోదీపై ధర్మపోరాటంలో విజయం సాధిస్తామని కేఈ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలను భూతంలా జీఎస్టీ వెంటాడుతోందని, మోదీ వల్ల దేశం వెలిగిపోవడం లేదని...మంటల్లో చితికిపోతోందని కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు.