బ్రాహ్మణ నిధులను టీడీపీ నేతలే 'స్వాహా' చేస్తున్నారు : విశాఖ పీఠాధిపతి
విజయవాడ : ఏపీ అధికార పార్టీ టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. ఎన్నికలకు ముందు బ్రాహ్మణుల ఓట్ల కోసం తన చుట్టూ ప్రదక్షిణలు చేసిన పార్టీ ఇప్పుడు బ్రాహ్మణుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన విప్రోత్సవ కార్యక్రమంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తన వద్దకు వచ్చిన సుజనా చౌదరి, బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారని, తీరా గెలిచాక ఆ విషయాన్నే మరిచిపోయారని ఆరోపించారు. 500 కోట్లతో బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటుకు హామి ఇచ్చి, ఆచరణలో మాత్రం నామమాత్రపు నిధులతో కార్పోరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణుల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు.
బ్రాహ్మణ కార్పోరేషన్ కి ఇస్తోన్న ఆ నామమాత్రపు నిధులను కూడా టీడీపీ నేతలే జేబులో వేసుకుంటున్నారని, టీడీపీ కార్యకర్తలు వాటిని నొక్కేసే పనిలో మునిగిపోయారన్నారు. బ్రాహ్మణుల పట్ల టీడీపీకి ఎందుకింత వివక్ష అని ప్రశ్నించిన ఆయన.. రాష్ట్రంలో బ్రతికే పరిస్థితి లేకపోతే హిమాలయాలకు వెళ్లైనా బతుకుతానన్నారు.
ఏదో నామమాత్రపు కార్పోరేషన్ ఏర్పాటు చేసినంత బ్రాహ్మణ సామాజిక వర్గమంతా, టీడీపీకే ఓటు వేస్తారని భావించడం ఆ పార్టీ అవివేకమని తేల్చి చెప్పారు. దేవాలయాల్లో అర్చకుల చేత నానా చాకిరీ చేయించుకుని, తీరా జీతాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని మండిపడ్డారు.