కలిసిపోయినట్టేనా?: బుడ్డా చేరికతో రాజీపడ్డ భూమా, శిల్పా
అమరావతి: వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీలోకి చేరడంతో భూమా, శిల్పా వర్గీయుల మధ్య కుమ్ములాట మొదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి టీడీపీలోకి చేరడం వల్ల కర్నూలు జిల్లా టిడీపీలో కుమ్ములాటలకు తెర పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మొన్నటివరకు ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకోవడమే కాక పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ, కర్నూలు జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి గురువారం విజయవాడలో కలిసిపోయినట్లు కనిపించారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు 35 బస్సుల్లో భారీగా తన అనుచరవర్గంతో గురువారం విజయవాడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖరరెడ్డి నేరుగా ఏపీ సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు.
బుడ్డా చేరికతో రాజీపడ్డ భూమా, శిల్పా
ఈ సమయంలో బుడ్డాతో పాటు భూమా, శిల్పాలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భూమా, శిల్పాల మధ్య మాట కలిసింది. కర్నులు జిల్లాలో పార్టీ పరిస్థితులపై ఇద్దరు నేతలు పరస్పరం చర్చించుకున్నారు. బుడ్డా రాజశేఖరరెడ్డి కూడా వారితో కలిసి జిల్లా అభివృద్ధిపై పలు అంశాలను చర్చించారు.
బుడ్డా చేరికతో రాజీపడ్డ భూమా, శిల్పా
జిల్లాలో భూమా, శిల్పా వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు వారిద్దరి మధ్య సయోధ్యను కుదుర్చి పార్టీ కోసం కలిసి పనిచేయాల్సిందిగా కోరడంతో శిల్పా మెత్తబడ్డ సంగతి తెలిసిందే. నిన్నటి వరకూ కారాలు మిరియాలు నూరుకున్న నేతలు బుడ్డా చేరికతో కలిసి మాట్లాడుకోవడం అక్కడికి వచ్చిన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది.
బుడ్డా చేరికతో రాజీపడ్డ భూమా, శిల్పా
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో మొత్తం 14 స్థానాలకు గాను టీడీపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ జిల్లాలో వైసీపీ అత్యధికంగా 12 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా ఇప్పటి వరకు వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మేల్యేలు టీడీపీలో చేరారు.
బుడ్డా చేరికతో రాజీపడ్డ భూమా, శిల్పా
జిల్లాకు చెందిన మరింత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్న నేపథ్యంలో భూమా, శిల్పాల మధ్య రాజీ కుదరడం తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అంశంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.