చంద్రబాబు తంత్ర శక్తి సన్నగిల్లింది- టీడీపీ ఫ్యూచర్పై హింట్ ఇచ్చిన ఎంపీ
అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో పోటాపోటీ రాజకీయం నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. సంక్షేమ పథకాల నిధులను జనం మధ్యే విడుదల చేస్తోన్నారు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇవ్వాళ కూడా ఆయన అన్నమయ్య జిల్లా మదనపల్లికి వెళ్లారు. విద్యా దీవెన కింద నాలుగో విడత నిధులను మంజూరు చేశారు. శుక్ర, శనివారాల్లో తన సొంత నియోజకవర్గం కడపజిల్లా పులివెందులకు వెళ్లనున్నారు.

పోటీగా చంద్రబాబు..
మరోవంక- తెలుగుదేశం పార్టీ కూడా తగ్గట్లేదు. బాదుడే బాదుడు కార్యక్రంతో ప్రజల్లోకి వెళ్తోంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఇందులో పాల్గొంటోన్నారు. ఒక్కో జిల్లాలో మూడు రోజుల పాటు మకాం వేస్తోన్నారు. ఇదివరకు కర్నూలు జిల్లాలో పర్యటించారాయన. ఇప్పుడు తాజాగా ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటకు వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడే బహిరంగ సభలు, రోడ్షోలను నిర్వహించనున్నారు.

చేరికల జోరు..
అదే సమయంలో- తెలుగుదేశం పార్టీ నుంచి చేరికలు కూడా తీవ్రం అయ్యాయి. ఆ పార్టీకి చెందిన విశాఖపట్నం నార్త్ శాసన సభ్యుడు గంటా శ్రీనివాస రావు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు. గురువారం ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఆయనతో పాటు టీడీపీకే చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ కండువాను కప్పుకొంటారనే ప్రచారం ఉంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

ఆరు నెలల్లో..
అదే సమయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి మరో బాంబు పేల్చారు. టీడీపీ నుంచి వైసీపీలోకి మరిన్ని చేరికలు ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపించే కొద్దీ చేరికలు పెరుగుతాయని పేర్కొన్నారు. టీడీపీలో ఎవరూ ఉండరని, ఇతర పార్టీలకు వైపు చూపులు సారిస్తోన్నారని చెప్పుకొచ్చారాయన. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రజల్లో టీడీపీకి ఏ మాత్రం ఆదరణ లేదని, ఎన్నికలను ఎదుర్కొనే సామర్థ్యం పార్టీకి లేదనే విషయం క్యాడర్కు అర్థమైందని వివరించారు.

ఆరు నెలల్లోగా
ఇంకో ఆరు నెలల్లో టీడీపీ ముక్క చెక్కలవుతుందని విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు. రాజకీయంగా భవిష్యత్ కోరకునే నాయకులెవరూ ఆ పార్టీలో ఉండబోరని అన్నారు. ఇతర పార్టీల్లోకి వలస వెళ్తారనీ స్పష్టం చేశారు. చంద్రబాబు మంత్ర దండం పని చేయట్లేదని, అది తంత్ర శక్తిని కోల్పోయిందని ఎద్దేవా చేశారు. వేర్వేరు వ్యవస్థల్లో చంద్రబాబు పెట్టిన స్లీపర్ సెల్స్ శక్తి సైతం సన్నగిల్లిందని వ్యాఖ్యానించారు విజయసాయి రెడ్డి. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications