అసెంబ్లీకి టీడీపీ ప్రజాప్రతినిధుల ర్యాలీ- నివర్ తుపాను బాధితులకు సాయం- ఇతర డిమాండ్లు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిచడం ద్వారా సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని భావిస్తున్న విపక్ష టిడీపీ తొలిరోజు నిరసనలకు దిగింది. నివర్ తుపాను బాధితులకు సాయంతో పాటు ఇతర డిమాండ్లతో అసెంబ్లీ బయట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీ నిర్వహించారు.
అసెంబ్లీ బయట ప్లకార్డులతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శన చేపట్టారు. ఇందులో పార్టీ అధినేత చంద్రబాబు, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ లోకేష్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నివర్ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. జీవనోపాధి కోల్పోయిన పేదలను కూడా ఆదుకోవాలన్నారు.
ప్రతీ పేద కుటుంబానికీ పది వేల రూపాయల సాయం చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. పంట బీమాకు రైతులు కట్టే ప్రీమియం కట్టకుండా అడ్డుకున్న ప్రభుత్వం, తాము కూడా కట్టకుండా రైతులను మోసం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.
మైక్రో ఇరగేషన్ సబ్సిడీకి మంగళం పాడారు, రైతులను నమ్మించి మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు కాబట్టి పంటల బీమాను ప్రభుత్వమే చెల్లించాలని టీడీపీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. రైతు ద్రోహి జగన్మోహన్రెడ్డి డౌన్ డౌన్, రైతులకు రూ.20 వేల కోట్ల భరోసా ఎగ్గొట్టారు, అన్నదాత సుఖీభవ రద్దు చేశారంటూ టీడీపీ నేతలు అసెంబ్లీ బయట నినాదాలు చేశారు. ఈసారి టీడీపీ అసెంబ్లీ సమావేశాల్లో నివర్ తుపానుతో పాటు ఇసుక, మద్యం అక్రమాలు, పలు ఇతర అంశాలను ప్రస్తావించబోతోంది.