రేపటి నుంచే టీడిపి మహానాడు..!ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుండి పార్టీ శ్రేణులకు సందేశం ఇవ్వనున్న చంద్రబాబు
హైదరాబాద్ : తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలా చాటి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, రాష్ట్ర మరియు దేశరాజకీయాలకు విశ్వసనీయ సిద్ధాంతాలను పరిచయం చేసిన సర్వీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా పండుగలా ఘనంగా జరుపుకునే వేడుక మహానాడు. ఈసారి లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో ఆన్ లైన్లోనే జూమ్ వెబినార్ ద్వారా మే 27,28 తేదీలలో వర్చువల్ మహానాడును నిర్వహిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ సమావేశాలలో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సంస్థాగత అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అప్రజాస్వామిక విధానాలపై లోతైన చర్చ జరుగుతుంది.
కరోనా ఎఫెక్ట్: ఈసారి మహానాడు ఆన్లైన్లోనే...టెక్ టర్న్ తీసుకున్న గ్రాండ్ ఈవెంట్..!
టీడిపి జెండా పండుగ వచ్చేసింది.. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో రెండురోజుల మహానాడు వేడుక..
1982 నుండి జరుపుకునే మహానాడు కార్యక్రమానికి ఎంతో విశిష్ఠత ఉంది. మే 28 తారీఖు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టిన రోజునే ఆయన జయంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ చేసుకునే పండగే మహానాడు. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సంబంధించి ప్రతీ సంవత్సరం జరిగే పార్టీ కార్యక్రమం. ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఏజెండాలను వివిధ సమస్యలపై పార్టీ తీర్మాలను ప్రకటిస్తారు. ఇది మూడు రోజుల కార్యక్రమం. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలోనే ప్రతి రెండేళ్లకొకసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
టెక్నాలజీతో అప్డేట్ అవుతున్న టీడిపి.. జూమ్ వెబినార్ ద్వారా మహానాడు..
అంతే కాకుండా మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు ప్రతి టీడిపి కార్యకర్త. శాస్త్ర సంకేతికతతో ఎప్పుడూ అనుసంధానమయ్యే హైటెక్ పార్టీ అయిన టీడీపీ దేశంలో తొలిసారిగా తన పార్టీ ప్రధానమైన ప్రత్యేక కార్యక్రమాన్ని టెక్నాలజీ ఆధారంగా నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో మహానాడును రద్దు చేస్తారని అందరూ సందేహాలను వ్యక్తం చేసారు. కాని అందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భిన్నంగా నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు. దేశంలో పార్టీ కోసం టెక్నాలజీని సమర్థంగా వాడుకున్న తొలి పార్టీ తెలుగుదేశం. టెక్నాలజీ ద్వారానే పార్టీ కార్యకర్తల డేటాబేస్ ను కచ్చితత్వంతో సమగ్రంగా నిర్వహించగలిగింది. దీనిద్వారా పార్టీ కార్యకర్తలకు భీమా సదుపాయాన్ని కల్పించిన మొట్టమొదటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ.
14 వేల మంది పాల్గొనేలా ప్రణాళికలు.. ప్రారంభోపన్యాసం చేయనున్న చంద్రబాబు..
ఇపుడు అదే టెక్నాలజీని మరోసారి పెద్ద స్థాయిలో వాడనుంది తెలుగుదేశం పార్టీ. మే 27, 28న రెండు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. జూమ్ వెబినార్ యాప్ ద్వారా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తొలి పార్టీ కూడా తెలుగుదేశమే. ఈ కార్యక్రమంలో దాదాపు 14 వేల మంది పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సంస్థాగత అంశాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రత్యేక హోదా, విభజన చట్టం అంశాలపై మహానాడులో లోతుగా చర్చించనున్నారు. అందుకు తగ్గ వివిధ తీర్మాణాలను కూడా ప్రవేశపెట్టనున్నారు పార్టీ నాయకులు.
తెలుగుతమ్ముళ్లు ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ.. స్పూర్తి నింపనున్న చంద్రబాబు ఉపన్యాసం..
1982లో పార్టీ అధికారంలోకి రాకముందే తిరుపతిలో ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు రోజుల పాటు మహానాడును నిర్వహించారు. దానికి ప్రజలనుండి వచ్చిన అద్బుత స్పందన చూసిన ఎన్టీఆర్ ఆ వేడుకను ప్రతి సంవత్సరం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీని తొలిసారి అధికారంలోకి తెచ్చిన తర్వాత 1983, మే 26,27,28 తేదీలలో విజయవాడలో మహానాడు నిర్వహించారు స్వర్గీయ ఎన్టీఆర్. అంతకు ముందు అత్యంత ఘనంగా జరిగిన ఆ వేడుకలకు జాతీయస్థాయి నాయకులందరూ హాజరయ్యారు. నాటి మహానాడుకు జగ్జీవన్ రామ్, చండ్ర రాజేశ్వరరావు వంటి దేశంలోని జాతీయనాయకులంతా విచ్చేసారు. అందుకే అది చారిత్రాత్మక మహానాడు అయ్యిందని పార్టీ ముందుతరం నేతలు ఇప్పటికి చర్చించుకుంటారు.