పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వాళ్లకు నిద్ర పట్టటం లేదు: మహానాడులో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు పండుగ గోదావరి తీరాన అత్యంత ఘనంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు జరగనున్న మహానాడు ఇదే కావడంతో రెట్టించిన ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్లు మహానాడులో పాల్గొంటున్నారు. రాజమండ్రిలో తెలుగుతమ్ముళ్ళ సందడి కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేలా టిడిపి ప్రతినిధుల ప్రసంగాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మహానాడులో ప్రసంగించారు.
వైసిపి వ్యతిరేక ఓటు చీలనివ్వనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో జగన్ మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని, వైసిపి నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న మంచి మనసుతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసిపి ప్రభుత్వ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయని ఆయన పేర్కొన్నారు.

ఏపీని హింసావాది చేతుల్లో నుంచి కాపాడుకోవాలని ప్రజలు కూడా భావిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఇదే క్రమంలో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ జెండా లు కడతారా అంటూ ఆయన వైసీపీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాట్లాడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసు సీఎం జగన్ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి సిబిఐ కి ఏమి అడ్డం వచ్చిందో చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. సిబిఐ లాంటి అతిపెద్ద నేర పరిశోధన సంస్థ ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి టిడిపి శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో వచ్చే ఎన్నికలకు పనిచేయాలన్నారు. రేపటి సభలో చంద్రబాబు ఎన్నికల సందేశాన్ని ఇస్తారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మహానాడు వేదికగా టీడీపీ ప్రతినిధులు ఏపీలోని ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తున్న పరిస్థితి ఉంది.












Click it and Unblock the Notifications