బాలికపై టిడిపి నేత తనయుడి అఘాయిత్యం
విజయవాడ: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కురిచర్ల గ్రామంలో అయిదేళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నేత కుమారుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో బాధితురాలైన బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజమండ్రిలో అగ్నిప్రమాదం
రాజమండ్రి శ్యామల నగర్లో జరిగిన ఐస్క్రీం ఈవెంట్స్ కేటరింగ్ విభాగంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎవరో కావాలని ఐస్క్రీం కేటరింగ్ సంస్థకు నిప్పు పెట్టారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో 16 లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం చిన్నాపురం గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8మంది గాయపడ్డారు. లారీ ఆటో ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
నగ్నంగా సైకో వీరంగం
కర్నూలు జిల్లాలోని ఎన్టీఆర్నగర్లో ఏసు అనే ఓ సైకో వీరంగం సృష్టించాడు. కాలనీలో నగ్నంగా గొడ్డలి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాడు. పలువురిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే అప్రమత్తమైన కాలనీవాసులు సైకోను ఓ ఇంట్లో నిర్బంధించారు.
మహిళలు, చిన్నపిల్లలకు ఈ సైకోతో ప్రమాదం పొంచి వుందని స్థానికులు చెబుతున్నారు. అయితే సైకోపై పోలీసులకు సమాచారం అందించినా స్పందించడం లేదని స్థానికులు తెలిపారు.