కిరణ్పై చంద్రబాబు మల్లగుల్లాలు: సీమాంధ్ర కాంగ్పై డౌట్

సోమవారం అవిశ్వాస తీర్మానంపై విలేకరులు ప్రశ్నించగా చంద్రబాబు స్పందించారు. తమ పార్టీ ఎంపీలు కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం తర్వాత తాము పరిశీలిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే తమకు చాలా సంతోషమని వ్యాఖ్యానించారు. తద్వారా టిడిపి అవిశ్వాసంపై యోచిస్తున్నట్లుగా భావిస్తున్నారు.
ఈ నెల 12వ తేది నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అవిశ్వాసం పెడితే సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు, మంత్రులు ఎందరు తమతో కలిసి వస్తారనే విషయంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకురాగా ఆయన సాధ్యాసాధ్యాలపై చర్చించాక నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టాక, సరైన మద్దతు లభించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అంతేకాకుండా మద్దతిచ్చిన సీమాంధ్ర కాంగ్రెసు నేతల పైన అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశముందని, అప్పుడు తెలంగాణ బిల్లుకు మరింత సాఫీ అవుతుందని పలువురు సీమాంధ్ర టిడిపి నేతలు భావిస్తున్నారు.
అవిశ్వాసం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కిరణే కొనసాగినప్పటికీ ముఖ్యమైన తెలంగాణ బిల్లు మాత్రం చర్చించే అవకాశం ఉండదని పలువురు సీమాంధ్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే, తమ అవిశ్వాసానికి సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధుల నుండి ఎంత వరకు మద్దతు లభిస్తుందనే చర్చ కూడా సాగుతోంది. కిరణ్ బలంగా సమైక్యవాదం వినిపిస్తున్నందున ఆ సాకు చూపి తప్పించుకునే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.












Click it and Unblock the Notifications