‘మోడీతో పవన్, జగన్ కుమ్మక్కు! మోసం చేశారు: బాబంటే భయం, విజయసాయి శునకం!’
అమరావతి: ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు బీజేపీపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ విజయసాయి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లపై వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
Recommended Video
బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఒక్కటయ్యాయని, ఏపీ ప్రజలను ప్రధాని మోసం చేశారని మండిపడ్డారు. బాబుపై తీవ్ర విమర్శలు చేసిన విజయసాయిపైనా అదే స్థాయిలో విమర్శల దాడిని కొనసాగించారు.
విజయసాయిపై తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గురువారం మీడియాతో మాట్లాడుతూ..
బాబుపై ఇంత ఘోరమైన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి ఎంపీనా లేక శునకమా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం తల్లిదండ్రుల గురించి ఇంత ఘోరంగా మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొకరైతే విజయసాయిరెడ్డిని చెప్పుతో కొట్టేవారని అన్నారు.
మోడీ, పవన్, జగన్ కుమ్మక్కు..
మోడీ, పవన్, జగన్ కుమ్మక్కయ్యారని కేఈ ఆరోపించారు. ప్రధాని మోడీ ఏపీ ప్రజలను మోసం చేశారని అన్నారు. అంతేగాక, ఏపీ సీఎం చంద్రబాబును చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారని కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.
మోడీ మోసం దేశం గుర్తించింది
మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి మోడీ చేసిన మోసాన్ని దేశమంతా గుర్తించిందని, బీజేపీ మిత్ర ద్రోహానికి పాల్పడిందని మంత్రి విమర్శించారు. ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బీజేపీ, వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని, వైసీపీ రాజకీయాలు పెద్ద డ్రామా అని, మోడీ అంటే జగన్కు భయమని విమర్శించారు.
విజయసాయి సలహాతోనే జగన్ దోపిడీ
ఈడీ, సీబీఐ కేసుల నుంచి జగన్ తప్పించుకోలేరని, మోడీపై వైసీపీ విశ్వాసం ప్రకటించి, అవిశ్వాసం తీర్మానం ఇచ్చిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు సోమిరెడ్డి. విజయసాయిరెడ్డి సలహాలతోనే ప్రజాధనాన్ని జగన్ దోచుకున్నారని, సీఎం తల్లిదండ్రుల గురించి ఆయన నీచంగా మాట్లాడారంటూ దుయ్యబట్టారు. విజయ్ మాల్యా కంటే విజయసాయిరెడ్డి, జగన్ పెద్ద ఆర్థిక నేరస్థులని, ప్రజల డబ్బులు దోచుకుని విలాసవంతమైన భవంతులు నిర్మించుకున్నారని ఆరోపించారు.
మోడీతో కుమ్మక్కు వల్లే..
పైరవీలు చేయడంలో విజయసాయిరెడ్డి సిద్ధహస్తుడని, బీజేపీతో వైసీపీ కుమ్మక్కవడం వల్లే జగన్ కేసులో అటాచ్ అయిన సొమ్ము వెనక్కి వచ్చిందని సోమిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విపక్షనేతలపై మోడీ కక్ష సాధిస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు.
అన్నం పెడితే చేతులు నరికేస్తున్నారు..
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వీడియోలు అసెంబ్లీలో ప్లే చేస్తే.. బీజేపీ నేతల కుర్చీలు కదులుతున్నాయని అన్నారు. అఖిలపక్షం భేటీకి బీజేపీ ఎందుకు హాజరు కాలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడతారని పదవులు ఇస్తే... అన్నం పెట్టిన చెయ్యినే బీజేపీ నేతలు నరికేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీతో పొత్తు లేకుండా సోము వీర్రాజు, మాధవ్ ఎమ్మెల్సీ అవ్వగలిగేవారా? అని ప్రశ్నించారు. ప్రజల దగ్గర డబ్బు తీసుకొనే పరిస్థితికి కారణం బీజేపీ కాదా? అంటూ నిలదీశారు. దాన్ని కూడా బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.
బాబుతో పెట్టుకుంటే ఓటమే
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న సీఎం చంద్రబాబుకు అడ్డుతగలాలని, ఆయనపై పోరాడాలని ఎవరైనా చూస్తే వారు ఓడిపోతారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కేంద్రంపై పోరాడుతున్న చంద్రబాబు కాళ్లు లాగే విధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంతో లాలూచీ పడ్డ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని, నాడు చేసిన వాగ్దానాలను మోడీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు.