దళితులకు విలువే లేదన్నరావెలపై మండి పడ్డ మంత్రి జవహర్: మంత్రి పదవి పోయిందనే
అమరావతి: టీడీపీలో దళితులకు ప్రాధాన్యం లేదన్న మాజీ మంత్రి రావెల కిషోర్బాబు సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు రావెల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్బాబు వ్యాఖ్యలపై తాజాగా మంత్రి జవహర్ మండిపడ్డారు. మంత్రి పదవి పోవడం వల్లే రావెల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి జవహర్ ధ్వజమెత్తారు.
మంత్రి పుల్లారావు పేరు చెప్పి తన నియోజకవర్గంలోనే 100 కోట్ల ఇసుక అక్రమంగా తవ్వేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు మరోసారి టిడిపి పై సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీలో దళిత ప్రజా ప్రతినిధులకు గౌరవం లేదని రావెల ఆరోపించారు. దీంతో రావెల వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపగా...ఈ వ్యాఖ్యలపై ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్ స్పందించారు.

మాజీ మంత్రి వ్యాఖ్యలపై...ప్రస్తుత మంత్రి ప్రతిస్పందన...
రావెల కిషోర్ బాబు మంత్రి పదవి పోవటం వల్లే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి జవహర్ మీడియాతో చెప్పారు. రావెల మాటలు మేడిపండు సామెతలాగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అసత్య ఆరోపణలతో పార్టీకి నష్టం చేయాలని చూస్తున్న రావెలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి జవహర్ తెలిపారు.

వరుస ఆరోపణలతో...కలకలం..
మంత్రి పుల్లారావు పేరు చెప్పి తన నియోజకవర్గంలోనే 100 కోట్ల ఇసుక అక్రమంగా తవ్వేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు మరోసారి టిడిపి పై సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీలో దళిత ప్రజా ప్రతినిధులకు గౌరవం లేదని రావెల ఆరోపించారు.
దీనివల్ల తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందన్నారు. టీడీపీలో దళిత ప్రజాప్రతినిధులకు పదవులు ఉంటాయి గానీ అధికారం మాత్రం ఉండదన్నారు. టీడీపీలో తన ఒక్క నియోజవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో అగ్రకుల నేతల పెత్తనమే ఉంటోందని రావెల వ్యాఖ్యానించారు.

ఆరోపణలు...ఉదాహరణలతో సహా...
రావెల కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా ఇందుకు పలు ఉదాహరణలు కూడా ఇవ్వడం గమనార్హం. కొవ్వూరు నియోజకవర్గం నుంచి మంత్రి జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నిజానికి ఆ నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేది అంతా సుబ్బరాజు చౌదరేనని రావెల చెప్పారు. అలాగే మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ నియోజవర్గంలో అధికారమంతా తెనాలి ఎమ్మెల్యే అలపాటి రాజా చేతుల్లోనే ఉందని రావెల కిషోర్ బాబు వెల్లడించారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యే మణి గాంధీ పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు.

మంత్రి పుల్లారావుకు...ముందే చెప్పానంటున్న రావెల...
ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంలో మంత్రి పుల్లారావు పేరు చెబుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారా?...అన్న ప్రశ్నకు రావెల కిషోర్ బాబు సమాధానమిస్తూ తొలుత ఆయన దృష్టికే తీసుకెళ్లానని, ఆయన విని వూరుకున్నారే తప్ప ఏమీ స్పందించలేదని రావెల కిషోర్ బాబు చెప్పారు. ఆ తరువాత
కొందరు కావాలని కుట్ర పూరితంగా తనకు కూడా వాటాలు పంపుతున్నామంటూ ప్రచారం చేశారని, ఆ విధంగా తన ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం చేయడంతో మైనింగ్ జరుగుతున్నప్రాంతానికి మీడియాను తీసుకెళ్లానని వెల్లడించారు. అయితే అక్కడ జరుగుతున్న దోపిడీ చూసి చాలా ఆశ్చర్యపోయానన్నారు.

టిడిపిలో...దళితులకు విలువే లేదు...
టీడీపీలో దళిత నేతలకు ఎలాంటి విలువ లేకుండాపోయిందని రావెల ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీలోని అగ్రకుల ఆధిపత్యాన్ని సహకరించేందుకు దళితులు సిద్ధంగా లేరంటూ రావెల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయంగా చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా దళిత వర్గానికి చెందిన రావెల కిషోర్ బాబు చేస్తున్న వ్యాఖ్యలు టిడిపికి, చంద్రబాబుకు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications