బావ పేరు ఎత్తని బాలయ్య - వ్యూహాత్మకమా: హిందూపురంలో ఏం జరిగింది..!!
శ్రీ సత్యసాయి పుట్టపర్తి: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తాజా సంచలనానికి తెర తీశారు. ఆయన వ్యవహారం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో గల తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం హిందూపురంలో ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం వాహనంపై ఎక్కడే గానీ పార్టీ అధినేత, తన సొంత బావ చంద్రబాబు నాయుడి ఫొటోలు లేకుండా ఆయన జాగ్రత్త పడ్డారు.
మగాళ్లను రెచ్చగొట్టే దుస్తులు ధరించేది మీరే.. వారిపై కంప్లైంట్లు ఇచ్చేది మీరే: కోర్టు
హ్యాట్రిక్ కోసం..
తన సొంత నిధులతో ఈ వాహనాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజల కోసం బాలకృష్ణ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై అతికించిన ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫొటోలు లేవు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుతో పాటు తన ఫొటోలను పెద్దగా కనిపించేలా ముద్రించారు. ఈ ఉచిత ఆరోగ్యరథంలో ఏఏ వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయనే వివరాలను అందరికీ కనిపించేలా వాటిపై పొందుపరిచారు.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఓడిపోని అసెంబ్లీ స్థానాల్లో ఇదీ ఒకటి. వరుసగా బాలకృష్ణ రెండుసార్లు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ రెండుసార్లు కూడా ఆయన భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించారు. ముచ్చటగా మూడోసారి గెలుపుజెండా పాతడానికి చర్యలు తీసుకుంటోన్నారు. ఇందులో భాగంగా.. తన సొంత నిధులతో వైద్య సేవలు ప్రారంభించారు.
రూ.40 లక్షలతో..
ఇంటి వద్దకే వైద్య సేవలను అందించడానికి ఉద్దేశించిన ఆరోగ్య రథం ఇది. దీని ద్వారా 200 పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, డాక్టర్లతో సంప్రదింపులు, మాతా-శిశు సంరక్షణ కింద వైద్య సేవలను అందిస్తారు. గ్రామాల్లో ఆరోగ్య అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తారు. 40 లక్షల రూపాయల వ్యయంతో బాలకృష్ణ.. ఈ రథాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో డాక్టర్, నర్స్, ఫార్మసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, ఆరుగురు వైద్య సిబ్బంది, మందుల కౌంటర్ ఉంటాయి.
ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి..
సాధారణ వ్యాధులకు అక్కడే వైద్యం అందించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ప్రతిరోజూ ఒక్కో గ్రామానికి ఈ వాహనం వెళ్తుంది. ఈ మధ్యాహ్నం బాలయ్య ఈ వాహనాన్ని తన భార్య వసుంధరతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి నుంచి హిందూపురంవాడినేనని అన్నారు. పార్టీలకు అతీతంగా సేవలు అందించడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈసీజీ సహా..
మొదటి సారిగా మొబైల్ వాహనంలో ఈసీజీ, అక్సీమీటర్, మైక్రోస్కోప్ వంటి పరికరాలు ఏర్పాటు చేశామని, 200 వైద్య పరీక్షలు ఇందులో చేసే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. 107 రకాల మందులు ఉచితంగా రోగులకు అందిస్తామని చెప్పారు. అవసరమైతే బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్స్టిట్యూట్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అన్నారు. గతంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.
మనుషులను మనుషులుగా గుర్తించండి..
ప్రస్తుతం ఆసుపత్రిలో 20 ఇంక్యుబెటర్లు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని పట్టించుకునే నాథుడు లేడని విమర్శించారు. మనుషులను మనుషులుగా గుర్తించడం కనీస సంస్కారమని, అది వైసీపీ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో హిందూపురాన్ని ఆరోగ్యపురంగా మారుస్తానని బాలకృష్ణ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. క్రమంగా దీన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.