పవన్ దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు లేదా క్షమాపణ చెప్పు, ఆయనది ఆవేశమే: టిడిపి
అమరావతి: పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు , మంత్రి లోకేష్పై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను బహిర్గతం చేయాలని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ మహేశ్వర్రావు డిమాండ్ చేశారు.
Recommended Video
గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏ ఆధారాలతో పవన్ కళ్యాణ్ మాట్లాడారో వాటిని ప్రజల ముందు పెట్టాలని ఆయన కోరారు. బిజెపి మాట్లాడిస్తేనే పవన్ కళ్యాణ్ మాట్లాడారని బొండా ఉమ మహేశ్వర్ రావు ఆరోపించారు
పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో అర్ధంలేని, అసంబద్దమైన ఆరోపణలను పవన్ కళ్యాణ్ చేశారని ఆయన చెప్పారు. జనసేన ఉనికిని పెంచుకొనేందుకు ఈ ఆరోపణలు చేశారని ఆయన చెప్పారు.
పవన్ వెనుక బిజెపి
ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయడంలో బిజెపి నిర్లక్ష్యంగా ఉందని ఆయన చెప్పారు. ఈ సమయంలో బిజెపిని నిలదీయకుండా టిడిపిపై విమర్శలు గుప్పించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. మాజీ టిటిడి సభ్యుడు శేఖర్రెడ్డికి, మంత్రి లోకేష్కు సంబంధాలున్నాయని ప్రధానమంత్రి మోడీ మీకు చెప్పారా, అమిత్ షా చెప్పారా, ఇతర బిజెపి నేతలు చెప్పారా బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజల గురించి పవన్ ఏనాడైనా మాట్లాడారా
ఏపీ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏనాడైనా పవన్ కళ్యాణ్ మాట్లాడారా చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే బొండా ప్రశ్నించారు.మోడీతో పవన్ కళ్యాణ్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొన్నాడని బొండా ఉమ మహేశ్వర్ రావు ఆరోపించారు. ఇంతకాలం పాటు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఏనాడైనా రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రధానమంత్రిని కోరారా అని ప్రశ్నించారు.
ఆవేశం తప్ప పవన్ కు ఆలోచన లేదు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఆవేశం తప్ప, ఆలోచన లేదని ఏపీ ప్రభుత్వ విప్ పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. . నాలుగేళ్ల పాటు తమతో ఉంటూ అకస్మాత్తుగా టీడీపీపై విమర్శలు చేయడం అనుమానాలనకు దారితీస్తోందని అన్నారు. పవన్ వెనుక బీజేపీ హస్తం ఉండచ్చొని, పవన్ను బీజేపీ ఒక పావులా వాడుకుంటుందని అభిప్రాయపడ్డారు.ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చాడు కాబట్టే ఆయన సలహాలను పరిగణలోకి తీసుకున్నామని పల్లె రఘునాథరెడ్డి అన్నారు.
బాబుకు, లోకేష్కు పవన్ క్షమాపణ చెప్పాలి
అర్ధరహితమైన ఆరోపణలు చేసిన జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు , మంత్రి లోకేష్కు క్షమాపణ చెప్పాలని టిడిపి ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఇంతకాలం ఎందుకు మాట్లాడ లేదని ఆయన ప్రశ్నించారు.ఏ ఆధారాలతో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారో చెప్పాలని ఆయన కోరారు.
టిడిపిని బలహీనపర్చేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
40 ఏళ్ళలో బాబుపై ఎక్కడ కూడ బాబుపై ఆరోపణలు లేవు. లోకేష్పై ఆరోపణలు కూడ సరికావని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసి కార్యకర్తలకు సూచనలు ఇస్తారని అనుకొన్నాం, కానీ, టిడిపిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం దారుణంగా ఉందని చినరాజప్ప చెప్పారు. టిడిపిలో ఏపీలో బలంగా ఉన్నందున, టిడిపిని బలహీనపర్చేందుకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజల సహకారంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఎర్రచందనం, రౌడీయిజం, భూ కబ్జాలను అరికట్టామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టినట్టు ఆయన చెప్పారు. డబ్బులు తీసుకొని ఓట్లు వేయాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను అవినీతిని ప్రోత్సహిస్తున్నారని చినరాజప్ప అభిప్రాయపడ్డారు.