'ఓటుకు నోటులో వైసీపీ కుట్ర', అప్పడు వైఎస్, ఇప్పుడు జగన్ : ధూళిపాళ్ల
గుంటూరు : ఓటుకు నోటు కేసు విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చి చంద్రబాబును ఇరుకున పెట్టేందుకే ప్రయత్నిస్తోన్న వైసీపీపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. వైసీపీ పార్టీ వ్యవహారమంతా టీడీపీపై బురదజల్లేదిగా మారిందని విమర్శించారు.
ఓటుకు నోటు కేసు హైదరాబాద్ లో జరిగిందన్న విషయాన్ని గుర్తు చేసిన ధూళిపాళ్ల నరేంద్ర.. ఆ కేసును గతంలోనే కోర్టు కొట్టివేసిందని చెప్పుకొచ్చారు. ఒకసారి కొట్టేసిన కేసును వైసీపీ మళ్లీ తెర పైకి తీసుకొచ్చి కుట్ర చేస్తోందని ఆరోపించారు నరేంద్ర. ఏపీని చిన్నాభిన్నం చేయాలన్న కుట్ర, అభివృద్ధి జరగకూడదన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులు టీడీపీని టార్గెట్ చేశారన్న తరహాలో ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఇక చంద్రబాబుకు కేసులు కొత్త కాదన్న నరేంద్ర.. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలోను కేసులు పెడితే, సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ విత్ డ్రా చేసుకున్న సందర్బాలున్నాయని గుర్తు చేశారు. తమకు చట్టం పట్ల గౌరవముందని, చంద్రబాబును ఏ కేసులు ఏమి చేయలేవని ధీమా వ్యక్తం చేశారు ధూళిపాళ్ల నరేంద్ర.