ఎమ్మెల్యే రోజా ఇష్యూపై చర్చ: అసెంబ్లీలో ధూళిపాళ్ల వివాదాస్పద వ్యాఖ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యే రోజా బాధితులు చాలా మందే ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అసెంబ్లీలో రోజా వివాదంపై ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదికపై నిర్వహించిన చర్చలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సభలో వైసీపీ ఎమ్మెల్యేలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెబుతూ చదువుకున్నోడికన్నా చాకలోడు మేలన్నట్టు అనే సామెతను వినిపించారు. రోజా ప్రవర్తనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సభలోనే కాకుండా బయట కూడా రోజా అహంకారపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నారన్నారని అన్నారు.
సభలో ఏదైనా మాట్లాడితే చెల్లుబాటవుతుందన్న దృక్పథం ఏదైతే ఉందో ఆ అహంకార ధోరణి సరైనది కాదని ఆయన అన్నారు. అనిత, బొండా ఉమాతో పాటు రోజా బాధితులు చాలా మందే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రోజా అహంకార వైఖరికి సభ సాక్షిగా నిలిచిందన్నారు.
శాసనసభలో సభ్యులు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలన్న దానిపై నిబంధనల్లో పొందుపరిచారని వీటిపై పూర్తి అధికారం శాసనసభకు, స్పీకర్కు మాత్రమే ఉంటుందని అన్నారు. సభలో ఎవరూ ఉచ్చరించని భాషను తండ్రి వయసున్న బుచ్చయ్య చౌదరిపై రోజా మాట్లాడారని అన్నారు.
మంత్రులపై కూడా ఎలా పడితే అలా ఇష్టారాజ్యంగా మాట్లాడిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు. దళిత మంత్రలు, ఎమ్మెల్యేలపై పలుమార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశారని అన్నారు. వీళ్లు మాట్లాడే భాషను చూస్తే, బయటి ప్రజలు తరిమి కొడతారని అన్నారు.
రోజా మాదిరే తాము కూడా శాసన సభ్యులమే, ఇతరుల హక్కులను కాలరాసే అధికారం వేరొకరికి లేదని అన్నారు. నిబంధనల ప్రకారం సభలో తీసుకున్న చర్యలు కోర్టులు ప్రశ్నించకూడదని రాజ్యంగంలో స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. రోజా అబల కాదని ఆయన వ్యాఖ్యానించారు.
రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేయాలన్న సభ నిర్ణయానికి తాను మద్దతిస్తున్నానని, ఆమెకు ఎంత శిక్ష పడ్డా తక్కువేనని అన్నారు. అయితే రోజా వివాదంపై ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదికపై నిర్వహించిన చర్చలో ప్రతిపక్షం లేకపోవడం గమనార్హం.