సీఎం జగన్ .. రంగులకి ఓ మంత్రిత్వ శాఖ కేటాయిస్తే బాగుంటుంది... టీడీపీ నేత గోరంట్ల సెటైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగుల రాజకీయం కొనసాగుతోంది. అధికార,ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిమీద ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రంగుల పంచాయితీ నిత్యకృత్యంగా మారుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు రంగులు మార్చడం తో మొదలైన పంచాయతీ నేటికీ కొనసాగుతుంది. చివరికి సోషల్ మీడియాలో ఆ రంగుల మంత్రి ఎవరో చెప్పండయ్యా ఆయన పనితీరుకు ఏదో ఒక పురస్కారం ఇస్తామని సెటైర్లు వేసే దాక వెళ్ళింది.

టీడీపీ హయాంలో కట్టిన ఇళ్ళకు వైసీపీ రంగులు .. గోరంట్ల వ్యంగ్యాస్త్రాలు
తాజాగా టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ సర్కార్ పై వేసిన సెటైర్ ఆసక్తికరంగా మారింది. వైసీపీ సర్కార్ పై టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు-తొర్రెడు మధ్య ఉన్న గతంలో టిడిపి ప్రభుత్వం కట్టించిన ఇళ్ళు నాడు నేడు అంటూ ట్వీట్ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం జగన్ తన క్యాబినెట్ లో రంగులతో మంత్రిత్వశాఖను కేటాయిస్తే బాగుంటుందంటూ తన ట్వీట్ ద్వారా ఓ సలహా ఇచ్చారు.

రంగుల కోసం ఓ మంత్రిత్వ శాఖను కేటాయించండి అంటూ సెటైర్
టిడిపి హయాంలో కట్టిన ఇళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వ ఇప్పుడు రంగులు మారుస్తున్న కారణంగా, ఆయన ముఖ్యమంత్రికి ఈ సలహా ఇచ్చారు. మీ ప్రభుత్వ హయాంలో కేవలం రంగులకి ఒక మంత్రిత్వశాఖను కేటాయిస్తే బాగుంటుంది అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తెలుగుదేశం పార్టీ కట్టిన ఇళ్ళు ఇప్పటివరకు ఇవ్వకుండా, ఇప్పుడు వాటికి రంగులు మార్చి మీరే ఏదో కట్టినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని గోరంట్ల విమర్శలు గుప్పించారు.

వైసీపీ నేతలు ఇంకా రంగుల రాజకీయం మానుకోలేదని టీడీపీ నేతల మండిపాటు
టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం రంగుల రాజకీయం ఇంకా మానుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకే కాదు ఆర్టీసీ బస్సులకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసే ప్రభుత్వ ప్రకటనలకు సైతం వైసిపి రంగులనే వాడడం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. చివరకు పిల్లలు చదువుకునే పుస్తకాలు , స్కూల్ బ్యాగ్స్ కూడా వదల్లేదని మండిపడుతున్నారు. ఇప్పుడు టీడీపీ హయాంలో కట్టిన ఇళ్ళకు వైసీపీ రంగులను వేస్తున్నారని మండిపడుతున్నారు . గతంలో ఈ రంగుల వ్యవహారంపై కోర్టు అక్షింతలు వేసిన, సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా, అటు హైకోర్టు లోనూ, సుప్రీంకోర్టులోనూ స్పష్టంగా తీర్పులిచ్చినా వైసీపీ నేతలు మారడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు .












Click it and Unblock the Notifications