మరో టీడీపీ ఎమ్మెల్యే తెరాసలోకి? కొత్తింట్లోకి కేసీఆర్..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మంగళవారం బేగంపేటలోని సీఎం అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైన ఆయన ముఖ్యమంత్రితో ఏకాంతంగా చర్చలు జరిపారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ప్రకాశ్ గౌడ్ కోరారు.
పెండింగులో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. వాటిని పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని సమాచారం. అదే సమయంలో రాజకీయ పరిస్థితులు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు తెరాసలో చేరుతున్నారని సీఎం చెప్పారని తెలుస్తోంది.
ప్రభుత్వం మొదటి కేబినెట్ భేటీలోనే కీలక నిర్ణయాలు అన్నింటినీ తీసుకోవడం, వాటిని ఒక్కొక్కటి అమలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారని వినికిడి. తాను ప్రభుత్వానికి సహకరిస్తానని, త్వరలో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారని సమాచారం. అయితే, తాను తెరాసలో చేరనున్నట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కొట్టి పారేశారు.
కేసీఆర్కు కొత్త అధికారిక నివాసం
సీఎం క్యాంపు ఆఫీస్కు వాస్తుదోషం కారణంగా కొత్త అధికారిక నివాసాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న క్యాంప్ ఆఫీసుకు ఆగ్నేయం వీధి పోటు ఉందనే అభిప్రాయంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత క్యాంప్ ఆఫీసు పక్కనే ఉన్న జడ్జి క్వార్టర్స్లో మూడు బ్లాకులుగా నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.