AP Budget 2023-24:బడ్జెట్ అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు-జగన్ ఆగ్రహంతో స్పీకర్ సస్పెన్షన్-బయట మాక్ అసెంబ్లీ..
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఇవాళ అసాధారణ రీతిలో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్డెట్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
అమరావతి : ఏపీ అసెంబ్లీలో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్డెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. అసాధారాణ రీతిలో టీడీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీఎం జగన్..వారిని బయటకు పంపి బడ్జెట్ ప్రసంగం కొనసాగించాలని సభాపతిని కోరారు. దీంతో ఆయన మంత్రికి సంకేతాలు ఇచ్చారు. అనంతరం అసెంబ్లీ వ్యవహారాలమంత్రి బుగ్గన టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు.
బడ్డెట్ ప్రసంగాన్ని అడ్డుకుని సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి నిరసనకు దిగారు. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సస్పెన్షన్లు చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.ఆర్ధిక క్రమశిక్షణ లేని బడ్జెట్ బుగ్గన ప్రవేశపెట్టారని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.జగన్ పాలన మోనార్కిజంలా సాగుతోందన్నారు. ఆదాయం ఎంతో ఖర్చు ఎంతో చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. అప్పులు పట్టించుకోవటం కోసం ప్రజల్ని మోసగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో అవి నిర్వీర్యమైపోతున్నాయని బుచ్చయ్య విమర్శించారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేల కోసం నడిచే ఆసుపత్రికే నిధులు లేక మందులు ఇవ్వట్లేదంటే, ఇక ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి ఏంటని బుచ్చయ్య ప్రశ్నించారు. బుగ్గన ఆర్ధిక శాఖా మంత్రిగా కంటే అప్పుల శాఖా మంత్రిగా పేరు తెచ్చుకున్నారని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ప్రభుత్వం చేసిన 9లక్షల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సమాధానం చెప్పాలన్నారు. వ్యవసాయ రంగంలో చూపిన కేటాయింపులకు తగ్గట్టు ఖర్చులు లేకనే రైతులు పంటల విరామం ప్రకటిస్తున్నారన్నారు. 3రాజధానులకు 3ఇటుకలు కూడా పెట్టకుండా అమరావతి ని ఆటకెక్కించారని విమర్శించారు.

ప్రభుత్వం రూ.2.79లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. బడ్జెట్ లో వాస్తవాలు లేవని అడిగితే తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారన్నారు.వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చిట్ట చివరి బడ్జెట్ కూడా మోసపూరితమేనన్నారు. ఘనంగా కేటాయింపులు చూపుతూ ఖర్చు మాత్రం భూతద్దంలో వెతికినా కనిపంచని విధంగా ఉన్న గత బడ్జెట్ ల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు. శస్త్ర చికిత్స విజయవంతం రోగి మృతి అన్నట్లుగా బడ్జెట్ ను రూపొందించారన్నారు. కమీషన్ల కోసమే సాగునీటి రంగానికి రూ.22వేల కోట్ల కేటాయింపులు చూపారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన 2ప్రాజెక్టులు తెదేపా ప్రభుత్వ హయాంలో 90శాతం పనులు పూర్తి చేసుకున్నవే అన్నారు. 6లక్షల పై చిలుకు ఉద్యోగాలు కల్పించినట్లు సిగ్గులేకుండా అసత్యాలు చెప్పారన్నారు.













Click it and Unblock the Notifications