అమరావతిలో విలాస భవనాల కోసం బాబుపై టిడిపి ఎమ్మెల్యేల ఒత్తిడి!
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో విలాసవంతమైన ప్రాంతం, మంచి భవనాలు కావాలని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. సీడ్ కేపిటల్లో విలాసవంతమైన భవనాల కోసం 150 ఎకరాలు కేటాయించాలని, అందులో విల్లాలు నిర్మించాలని, దానిని పోష్ ఏరియాగా మార్చాలని సీఆర్డీఏపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు.
ఇదే విషయాన్ని టిడిపి ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకు వెళ్లారని తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్లో సెంట్రల్ బిజినెస్ కేంద్రం ఉంది. ఇది కమర్షియల్ సెంటర్. దీనిని ఉద్దండరాయునిపాలెంలో ప్రతిపాదించారు.
ఈ సెంట్రల్ బిజినెస్ కేంద్రంలో విల్లాలు కావాలని వారు అడిగినట్లుగా తెలుస్తోంది. అమరావతి మాస్టర్ ప్లాన్లో ప్రధాన వాణిజ్య ప్రాంతంగా ఉద్దండరాయుని పాలెం ప్రాంతాన్ని ఎంపిక చేయగా, ఇదే ప్రాంతంలో మెట్రో రైల్ నెట్ వర్క్, వేలాది ఉద్యోగాలు కల్పించే ప్రధాన వ్యాపార కేంద్రాలు ఏర్పడనున్నాయి.
ఇదే ప్రాంతంలో తమకు నివాస గృహాలను విలాసవంతంగా నిర్మించి ఇవ్వడం ద్వారా, మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించ వచ్చని ఎమ్మెల్యేలు సూచిస్తున్నారని తెలుస్తోంది.
సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో సవివరణాత్మక మాస్టర్ ప్లాన్ను స్విస్ చాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టు గెలుచుకున్న కంపెనీ అందిస్తుందని, ఈ ప్రాంతంలో అత్యాధునిక భవంతుల సముదాయం నిర్మితమైతే అది రాజధానికే తలమానికం అవుతుందని మంత్రి పి నారాయణ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ కాంప్లెక్స్, నగరానికి గేట్ వే, సాంస్కృతిక సెంటర్లు, కన్వెన్షన్ హాల్ తదితరాలు సీడ్ క్యాపిటల్లో రానున్నాయి. ఇక్కడ విలాసవంతమైన ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు టిడిపి ఎమ్మెల్యేల నుంచి ముఖ్యంగా గుంటూరు ప్రాంత నేతల నుంచి మద్దతు ఎక్కువ లభిస్తోందని తెలుస్తోంది.
ప్రతి నగరానికి ఓ విలాసవంతమైన ప్రాంతం ఉంటుందని, అమరావతికి కూడా అలాంటి ప్రాంతం కావాలని, కాబట్టే తాము ఇలా అడుగుతున్నామని అని గుంటూరు జిల్లా నేత ఒకరు వ్యాఖ్యానించారని తెలుస్తోంది.