విజయసాయిరెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి:బుద్దా వెంకన్న
అమరావతి : వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నఅన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అసలు బిజెపి సభ్యులకు లేని దురద విజయసాయిరెడ్డికి ఎందుకని, అతడు బిజెపికి కోవర్ట్ కాబట్టే చంద్రబాబుకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఇక కాళ్లకు మొక్కడంలో విజయసాయిరెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్, విజయసాయిరెడ్డిలు రాహు-కేతువులు లాంటి వారని ఎమ్మెల్సీ బద్దా వెంకన్న విమర్శించారు.
మరోవైపు ముస్లిం మైనారిటీలను పార్టీలోకి రమ్మని ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ఇప్పుడు ఆహ్వానిస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. తాను బిజెపిని వదిలేశానని...పార్టీలోకి రండని ఇప్పుడు చంద్రబాబు పిలవడం విచిత్రంగా ఉందన్నారు. విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ మైనారిటీల విభాగం ఆధ్వర్యంలో నిరాహారదీక్ష జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మైనారిటీలు వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నారని చెప్పారు. టీడీపీ, బీజేపీలు మైనారిటీలకు ద్రోహం చేసిన పార్టీలని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ ఒక్క మైనారిటీకి అయినా చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారా? అని ప్రశి్నంచారు. మైనారిటీల ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని,మరోసారి మైనారిటీలను మోసగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీతో వైఎస్ఆర్సీపీ కలుస్తోందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.