జగన్ వెన్నుపోటుకు 9 ఏళ్లు - రొమ్ము గుద్దే రకమన్న వెంకన్న - విజయసాయిరెడ్డికి దిమ్మతిరిగేలా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ''వెన్నుపోటు'' అంశం ప్రధాన టాపిక్ గా మారింది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 25 ఏళ్లు పూర్తయిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్లు చేయగా.. అవకాశవాదులుగా సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచింది మీరేనంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దిమ్మతిరిగే రీతిలో కౌంటరిచ్చారు.
Recommended Video
ఎస్పీ బాలు 54ఏళ్ల కళాప్రస్థానం - సుగుణాలు నేర్పారన్న విజయశాంతి - తమిళనాడు సర్కార్ కీలక ప్రకటన
అసలేం జరిగిందంటే..
పాతికేళ్ల క్రితం టీడీపీలో అంతర్గత సంక్షోభం తలెత్తి ఎన్టీఆర్ సీఎం పదవికి, పార్టీ సారధ్యానికి దూరం కావాల్సి వచ్చింది. టీడీపీని తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు.. 1995, ఆగస్టు 24న ఎన్టీఆర్ పై సస్పెన్ వేటువేసి, టీడీఎల్పీ నేత ఎన్నికయ్యారు. అనంతరం వైస్రాయ్ హోటల్ వేదికగా జరిగిన ఘటనల్లో.. ఆగస్టు 27న ఎన్టీఆర్ పై చెప్పుల దాడి జరిగింది. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాలు జరిగిన నాలుగు నెలల తర్వాత ఎన్టీఆర్ తుదిశ్వాస విడిచారు. వెన్నుపోటుగా చరిత్రకెక్కిన నాటి ఘటనపై వైసీపీ ఎంపీ అనూహ్య వ్యాఖ్యలు చేయగా, టీడీపీ ఎమ్మెల్సీ రివర్స్ అటాక్ చేశారు.
బాబు వెన్నుపోటుకు 25 ఏళ్లు..
చంద్రబాబును ఉద్దేశించి ఆదివారం వరుస ట్వీట్లుచేసిన విజయసాయి వెన్నుపోటు ఘటనకు 25 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు. పాతికేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు ఎన్టీఆర్ ను చంద్రబాబు అండ్ కో వెన్నుపోటు పొడిచి, పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించి, పార్టీ పగ్గాలు లాక్కుని, తీవ్రంగా అవమానించారని, ఇప్పటికీ ఎన్టీఆర్ పై సస్పెన్షన్ వేటు ఎత్తేయలేదని, నిజమైన తెలుగు తమ్ముళ్లు ఎన్నటికీ చంద్రబాబును క్షమించబోరని సాయిరెడ్డి అన్నారు. మామను అంతం చేసిందేకాకుండా, ఆయన వారసరత్వం కోసం చంద్రబాబు అర్రులు చాచారని విమర్శించారు. కాగా,
చంద్రబాబు వెన్నుపోటుకు 25 ఏళ్ళు - ఎన్టీఆర్ సస్పెన్షన్ ఎత్తేస్తారా? - విజయసాయిరెడ్డి -అప్పుడేమైందంటే
జగన్ వెన్నుపోటుకు 9 ఏళ్ళు
వైసీపీ సాయిరెడ్డి చేసే కామెంట్లు, ప్రకటనలపై వెంటనే స్పందిస్తూ, ఎప్పటికప్పుడు కౌంటర్లు వేయడంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ముందుంటారు. వెన్నుపోటు వ్యవహారంలోనూ ఆయన వెంటనే స్పందించారు. తండ్రీకొడుకులకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి, వైఎస్సార్ ను ముఖ్యమంత్రిని చేసిన సోనియా గాంధీకి జగన్ వెన్నుపోటు పొడిచి సరిగ్గా 9 సంవత్సరాల, 5 నెలల, 11 రోజులైందని బుద్దా ఎద్దేవా చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించిన జగన్.. తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత సోనియా గాంధీతో విభేదాలు రావడంతో సొంతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం తెలిసిందే.
వైఎస్ ఆశయానికీ పోటేశాడు..
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోపాటు తండ్రి వైఎస్సార్ ఆశయానికి కూడా జగన్ వెన్నుపోటు పొడిచారని వెంకన్న చెప్పుకొచ్చారు. వైఎస్ బతికున్న రోజుల్లో.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే తన లక్ష్యమని పదే పదే చెప్పిన విషయాలను టీడీపీ నేత గుర్తుచేశారు. ‘‘రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమనే వైఎస్సార్ చివరి కోరిక అని జగన్ స్వయంగా పలు మార్లు చెప్పారు. అంటే, ఇప్పుడు, తండ్రి ఆశయానికి కూడా వెన్నుపోటు పొడిచిన తనయుడు అనిపించుకున్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం జగన్ రెడ్డి'' అని వెంకన్న ఘాటుగా విమర్శించారు.