తిరుపతిలో వైసీపీ గెలిస్తే భూములే కాదు ఏడుకొండలు కూడా అమ్మకానికి : ఎంపీ రామ్మోహన్ నాయుడు షాకింగ్ కామెంట్స్
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేతలను రంగంలోకి దించి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ నుండి మంత్రులు రంగంలోకి దిగి ప్రచారం చేస్తుంటే, టిడిపి నుండి ఎంపీ రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ లతోపాటు కేశినేని శ్వేత, బండారు శ్రావణి, హరీష్ బాలయోగి వంటి యువ నేతలు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు.
టిడిపిని గెలిపించాలని కోరేందుకు తాను తిరుపతికి రాలేదన్న చంద్రబాబు , ఎందుకు వచ్చారో తెలుసా !!
సీఎం జగన్ కు పాదసేవ చేసే మరో పార్లమెంటు సభ్యుడు కావాలా ?
ఇక తాజాగా టీడీపీ ఎంపీ ,యువనేత రామ్మోహన్ నాయుడు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి అభ్యర్థిగా పనబాక లక్ష్మి వంటి అవగాహన ఉన్న నేత ఎన్నికల బరిలోకి దిగడం గర్వంగా ఉందన్నారు. సమస్యలను పరిష్కరించే నాయకురాలు కావాలో, సీఎం జగన్ కు పాదసేవ చేసే మరో పార్లమెంటు సభ్యుడు కావాలో ? ప్రజలు తేల్చుకోవాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం పార్లమెంట్లో రాష్ట్రం కోసం టీడీపీ రాజీలేని పోరాటం చేసిందని, ఇక ముందు కూడా చేస్తుందని అన్నారు.
22 మంది ఎంపీలను జగన్ తన కేసుల కోసం లాలూచీ పడేలా చేశారు
సీఎం హోదాలో చంద్రబాబు పీఎం మోడీని రాష్ట్రం కోసం నిలదీశారు అని, బీజేపీతో విభేదించింది రాష్ట్రం కోసమేనని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తానని పాదయాత్రలో చెప్పి ఎన్నికలలో ఎంపీలను గెలుచుకున్నారు అని పేర్కొన్న రామ్మోహన్ నాయుడు 22 మంది ఎంపీలను జగన్ తన కేసుల కోసం లాలూచీ పడేలా చేశారని ఆరోపణలు గుప్పించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం లేఖలు రాయరు.. ఓట్ల కోసం ఇంటింటికీ జగన్ లేఖలు
విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకానికి పెడితే మాట్లాడడం లేదన్న రామ్మోహన్ నాయుడు, మోదీని ప్రశ్నిస్తే జగన్ ను జైల్లో పెడతారని భయపడి ఎంపీలు సైలెంట్ గా ఉంటున్నారు అని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ప్రశ్నించేది టిడిపి మాత్రమే అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం జగన్ కేంద్రానికి లేఖలు రాయడం లేదని , కానీ తిరుపతి ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటింటికి లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు.
విశాఖ భూములే కాదు గెలిస్తే తిరుపతి భూములు , ఏడుకొండలు కూడా అమ్మకానికి
వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయని పేర్కొన్నారు . విశాఖలో ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టారని, తిరుపతి లో వైసీపీ గెలిస్తే తిరుపతి భూములే కాదు ఏడుకొండలు కూడా అమ్మే ప్రమాదముందని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి పనబాక లక్ష్మిని గెలిపించాలని విజ్ఞప్తి చేసిన రామ్మోహన్ నాయుడు జగన్ హయాంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు . రాష్ట్రం అభివృద్ధి శూన్యం అయిందని , అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరముందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.