ఆ ఇద్దరు టీడీపీ ఎంపీల లెక్కే వేరు, సీన్ రివర్స్ - మార్పు ఖాయం..!?
వచ్చే ఎన్నికలు టీడీపీకి నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా మారుతున్నాయి. ప్రతీ సీటు కీలకంగా మారుతోంది. ఇటువంటి సమయంలో పార్టీ నారా లోకేశ్ యువగళం సక్సెస్ చేయటాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తోంది. ఈ సమయంలో టీడీపీకి పట్టున్న లోక్ సభ నియోజకవర్గాలైన గుంటూరు, విజయవాడలో సీన్ మారుతోంది. ఈ రెండు ప్రాంతాల్లో సిట్టింగ్ ఎంపీలు పోటీ చేసే అవకాశం కనిపించటం లేదు. లెక్కలు మారుతున్నాయి.
లోకేశ్ యాత్రకు దూరంగా: నారా లోకేశ్ యువగళం ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేశ్ యువగళం సక్సెస్ చేయటాన్ని టీడీపీ నేతలు సవాల్ గా తీసుకున్నారు. టీడీపీకి కృష్ణా, గుంటూరు జిల్లాలు తొలి నుంచి పట్టున్న ప్రాంతాలు. 2019 లో ఈ రెండు జిల్లాల్లోనూ టీడీపీ నాలుగు సీట్లకే పరిమితం అయింది.

అదే సమయంలో జగన్ వేవ్ లోనూ 2019 లో విజయవాడ, గుంటూరు లోక్ సభ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. కానీ, కొంత కాలంగా ఇక్కడ గెలిచిన ఇద్దరు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తమ పార్లమెంటరీ పరిధిలో లోకేశ్ యాత్ర జరగుతున్నా వారిద్దరు పాల్గొనలేదు. దీంతో, ఇక వీరిద్దరూ పార్టీలో కొనసాగుతారా లేదా అనేది ఇప్పుడు సందేహంగా మారుతోంది.
వచ్చే ఎన్నికల్లో నో ఛాన్స్: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చాలా కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. చంద్రబాబు నిర్వహించే పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు మాత్రమే జయదేవ్ హాజరవుతున్నారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ నుంచి ఒక ఎన్నారై తో పాటుగా మాజీ మంత్రి పేరు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక, విజయవాడ ఎంపీ కేశినేని ఇప్పుడు లోకేశ్ యాత్రకు హాజరు కాకపోవటంపై చర్చ మొదలైంది. యాత్ర విజయవాడలో ప్రారంభం నుంచి గన్నవరం వరకు యాత్ర ఏర్పాట్లను కేశినేని చిన్ని పర్యవేక్షిస్తున్నారు. నాని వ్యతిరేకించే పార్టీ నేతలతో కలిసి చిన్ని ఈ ఏర్పాట్లను పర్యవేక్షించటమే నాని యువగళనాకి దూరంగా ఉంటున్నారా..లేక పార్టీకే దూరంగా ఉండాలని భావిస్తున్నారా అనే చర్చ మొదలైంది.
పార్టీ నిర్ణయంపై ఉత్కంఠ: కేశినేని నాని తీరు పైన సొంత పార్టీ నేతలే కొంత కాలంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం వారికి నచ్చటం లేదు. ఇదే సమయంలో కేశినేని చిన్నికి పార్టీ కార్యక్రమాల్లో బాధ్యతలు ఇవ్వటం ద్వారా ఆయనే వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మహానాడులోనూ కేశినేని నాని పాల్గొన లేదు. ఇప్పుడు యువగళంకు దూరమయ్యారు. కేశినేని నానికి మద్దతు దారులుగా ఉన్న కొందరు నేతలు మాత్రం యాత్రలో పాల్గొన్నట్లు చెబుతున్నారు.

లోకేశ్ యాత్ర వేళ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నాని ఫొటోలకు అవకాశం ఇవ్వలేదు. తన కుమార్తెతో కలిసి లోకేశ్ యాత్రలో పాల్గొంటానని నాని చెప్పారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నాని పార్టీలో ఉంటారా..ఉన్నా టికెట్ దక్కే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో, టీడీపీలో ఇప్పుడు ఈ ఇద్దరు ఎంపీల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది.












Click it and Unblock the Notifications