బాబు రాజీ పడలేదు: జగన్కు జూపూడి కౌంటర్, రిజైన్ చేస్తే రాదన్న టిడిపి ఎంపిలు
విజయవాడ/ న్యూఢిల్లీ: కేసుల నుంచి బయపడేందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడదు రాజీ పడ్డారనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు కౌంటర్ ఇచ్చారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీ పడలేదని, కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల తర్వాత ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందని నమ్ముతున్నామని ఆయన తెలిపారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్మకం ఉందని రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ (టిడిపి) పార్లమెంటు సభ్యులు చెప్పారు. ఎపి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని వారు చెప్పారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు మాట్లాడే హక్కు లేదని వారన్నారు.
ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెసు పార్టీ బిల్లులో ఎందుకు చేర్చలేదని వారు ప్రశ్నించారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడిపైనా లేని కేసులు జగన్ మీద ఉన్నాయని వారన్నారు. కేసులపై విచారణను తప్పుదోవ పట్టించడానికే జగన్ దీక్షల నాటకం ఆడుతున్నారని వారు విమర్సించారు.
ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం ప్రకటించలేదని వారన్నారు అన్నారు. తాము రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం కూలిపోదని, కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే ప్రత్యేక హోదా సాధిస్తామని వారు చెప్పారు. విభజన చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని, షెడ్యూల్ 9,10లోని సంస్థల విభజనపై తెలంగాణ సహకరించడం లేదని టీడీపీ ఎంపీలు విమర్శించారు. సెక్షన్-8ని అమలు చేసి తీరాల్సిందేనని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.