చంద్రబాబు నిరసన దీక్ష - 36 గంటలు..పార్టీ కార్యాలయంలో : ధ్వంసమైన ప్రాంతంలోనే ..!!
టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దాడులను నిరసిస్తూ 36 గంటల పాటు నిరసన దీక్ష చేయాలని డిసైడ్ అయ్యారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష సాగనుంది. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో చంద్రబాబు ఈ దీక్ష చేపడుతున్నారు. కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద ఎక్కడైతే విధ్వసం జరిగిందో అక్కడే నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం పేట్రేగిపోతోందని చంద్రబాబు ఆరోపించారు.
దాడి జరిగిన కార్యాలయంలోనే దీక్ష
ఫ్యాక్షనిజానికి అధికారం తోడయ్యిందంటూ ఫైర్ అయ్యారు. దీనిలో పోలీసులు అంతర్భాగమయ్యారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం నశించిందని..ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద, మూక దాడులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరతీశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజంగా అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై మూక దాడి చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని చెప్పుకొచ్చారు. అక్కడున్న టీడీపీ నేతలు, సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడ్డారని వివరించారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారని చెప్పారు.
ముందస్తుతో కుట్ర అంటూ ఫైర్
రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు కుట్రతో పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేశారని చంద్రబాబు ఆరోపించారు. కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికి పోయేలా దాడులకు తెగబడ్డారని వివరించారు. నిన్నటి రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ముఖ్యమంత్రి, డీజీపీ ప్రోద్బలంతోనే ప్రతిపక్ష పార్టీ నేతలపై భౌతిక దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోందని చెప్పుకొచ్చారు. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం దమనకాండను మొదటినుంచీ కొనసాగిస్తోందన్నారు.
ప్రతీ ఒక్కరికి బాధ్యత ఉందంటూ
దీనిని నిలువరించాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రంలోని ప్రతి పౌరునిపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు ప్రజలు, ఇతర ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలిసి ముందుకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేసారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన దాడి పైన పోలీసులు కేసు నమోదు చేసారు. ఎస్సై నాయక్ పైన దాడి చేసారంటూ ఏ1గా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్ పైన హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు.
టీడీపీ నేతలు..దాడికి పాల్పడిన వారి పైన కేసులు
దాడి ఘటన లో 70 మంది పైన మంగళగిరి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దాడి ఘటన పైన ఇప్పటికే చంద్రబాబు గవర్నర్ తో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసారు. దీని పైన ఈ రోజున ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. దాడి జరిగిన కార్యాలయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ పరామర్శించారు.
టీడీపీ కార్యాలయం పైన దాడిని అన్ని పార్టీలు ఖండించాయి. టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా బూతులు మాట్లాడారని..తమను అభిమానించే వారు తట్టుకోలేక స్పందించారంటూ సీఎం జగన్ వివరించారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు తన దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.