త్వరలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్-టార్గెట్ నవంబర్-వైసీపీ నుంచి చేరే కీలక నేతలు వీరేనా?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. అయితే ఆ లోపే విషమిస్తున్న పరిస్ధితుల నుంచి బయటపడేందుకు సీఎం జగన్ ముందస్తు ఎన్నికల్ని ఎంచుకుంటారన్న ప్రచారం సాగుతోంది. దీంతో ప్రధాన విపక్షం టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ భారీ ఎత్తున చేరికల్ని ప్రోత్సహించేందుకు సిద్దమవుతోంది. ఇందులో వైసీపీ కీలక నేతలతో పాటు పలువురు మాజీ మంత్రులు కూడా ఉంటారని తెలుస్తోంది.

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా..వైసీపీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్ నేతల్ని తమ పార్టీలో చేర్చుకుంది. అప్పట్లో దీనిపై వైసీపీ అధినేతగా జగన్ తీవ్ర విమర్శలు చేసేవారు. సంతలో పశువుల్ని కొన్నట్లు తమ ఎమ్మెల్యేల్ని కొనేస్తున్నారని ఆరోపించేవారు. కానీ ఈ సంతోషం టీడీపీకి ఎంతోకాలం నిలవలేదు.
విజయసాయిరెడ్డిని ఎంపీ కాకుండా అడ్డుకునేందుకు ప్రారంభించిన ఈ ఆపరేషన్ ఆకర్ష్ 23 ఎమ్మెల్యేల వద్దే ఆగిపోవడంతో వైసీపీ ప్రయత్నాలు ఫలించి సాయిరెడ్డి ఎంపీ అయిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఈ 23 మందిలో కేవలం ఒక్కరిని మాత్రమే తిరిగి గెలిపించారు.ఆయనే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.

మరో ఆకర్ష్ కు టీడీపీ రెడీ
తాజాగా మహానాడు విజయవంతం కావడంతో ఊపుమీదున్న టీడీపీ ఇప్పుడు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీస్తోంది. అసలే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత నానాటికీ పెరుగుతుండటం, మరోవైపు కేబినెట్ ప్రక్షాళనతో మంత్రి పదవులు పొగోట్టుకుని రగిలిపోతున్న మాజీ మంత్రులు, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై ఇంకా అవకాశాలు దొరక్క అసంతృప్తిగా ఉన్న వారు.. ఇలా పలు కేటగిరిల్లో ఉన్న వారిని ఆకర్షించేందుకు టీడీపీ నేతలు అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో టచ్ లోకి వచ్చేశారు. మరికొందరు టైమ్ కోసం ఎదురుచూస్తున్నారు.

టీడీపీలోకి జంపయ్యేది వీరేనా?
టీడీపీలోకి జంపయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వారిలో బుట్టా రేణుక, పార్ధసారధి, మాజీ మంత్రి మేకపాటి సుచరిత, ఆనం రామనారాయణరెడ్డి, కిల్లి కృపారాణితో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు పలువురు మాజీ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు కూడా టీడీపీలో చేరికల కోసం ఎదురుచూస్తున్నారు.
వీరంతా ముందస్తు ఎన్నికలపై సంకేతాలు వెలువడగానే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నవారైతే పార్టీలో చేరితే తమకు లభించే స్ధానాలు, టికెట్లు ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు. వీరంతా నిజంగా చేరితే మాత్రం ఎన్నికలకు ముందు టీడీపీకి భారీ ఊపు వచ్చే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications