ఆత్మగౌరవం అమ్ముకోం: మేం వేసిన విత్తనమే అది: ప్రపంచం మొత్తం తిరిగా: వారికో పాదనమస్కారం
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో తాము అధికారంలో ఉన్న సమయంలోనే అభివృద్ధికి బీజం పడిందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధికి తాము కేరాఫ్ అడ్రస్గా నిలిచామని పునరుద్ధాటించారు. తాము అభివృద్ధి చేసిన ప్రాజెక్టుల ఫలితాలను ఇప్పుడు వేరొకరు అనుభవించే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిందని అన్నారు. దేవాదుల, వెలిగొండ మొదలుకుని అన్ని రకాల ప్రాజెక్టులను తెలుగుదేశం ప్రభుత్వమే నిర్మించిందని చెప్పుకొచ్చారు.

డిజిటల్ మహానాడుగా..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు మహానాడును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది దీన్ని నిర్వహించలేదు. ఈ సారి కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ అమల్లో ఉంది. పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించకపోయినప్పటికీ.. మహానాడును నిర్వహిస్తోంది టీడీపీ. ఇదివరకట్లా కాకుండా.. డిజిటల్ ప్లాట్ఫాంపై మహానాడును ఏర్పాటు చేసింది.

చంద్రబాబు ప్రసంగం..
గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు చంద్రబాబు. అనంతరం ఆయన జూమ్ యాప్ ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఇతర నాయకుల ప్రసంగం అనంతరం చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధి గురించి ప్రస్తావించారు.

హైదరాబాద్ను నేనే కట్టా.. ప్రపంచం మొత్తం తిరిగా..
హైదరాబాద్ను తానే నిర్మించానని చంద్రబాబు చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, సైబరాబాద్ వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేశానని అన్నారు. దేవాదుల, వెలిగొండ వంటి ప్రాజెక్టులను నిర్మించామని చెప్పారు. అభివృద్ధికి తాము విత్తనం వేశామని, అది ఇప్పుడు మహావృక్షమైందని అన్నారు. వాటి ఫలాలను మాత్రం వేరొకరు అనుభవించే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్రపంచం మొత్తం తిరిగా
రెండు తెలుగురాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేసింది తానేనని అన్నారు. దీనికోసం ప్రపంచం మొత్తం తిరిగానని గుర్తు చేశారు. ఫైళ్లను పట్టుకుని కాలి నడకన తిరిగానని గుర్తు చేశారు. తాను కష్టపడటం వల్లే ఐటీ రంగంలో హైదరాబాద్ పురోగమిస్తోందని చెప్పారు. నాలెడ్జి సొసైటీ అనేది ఏర్పాటుకు కారణమైందని అన్నారు. ఒకట్రెండు ప్రాజెక్టులు మినహా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని భారీ నీటి ప్రాజెక్టులను తాము పునాది వేశామని, వాటిని పూర్తి చేశామనీ అన్నారు.
Recommended Video

రెండు కిలోల బియ్యం వల్లే ఆహార భద్రత..
కిలో బియ్యం రెండు రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చంద్రబాబు అన్నారు. అదే ఇప్పుడు ఆహార భద్రత పథకంగా మారిందని, దేశం మొత్తం దీన్ని అనుసరించే పరిస్థితి ఉందని చెప్పారు. ఇలాంటి పథకాలను ఎన్నో తాము ఆరంభించినట్లు గుర్తు చేశారు. తాము అధికారంలో ఉన్నన్ని రోజులూ పేదలు, బడుగు, బలహీన వర్గాల గురించి ఆలోచించామే తప్ప బడాబాబులకు రాజకీయ లబ్దిని కల్పించలేదని అన్నారు.

అవినీతి.. ప్రత్యర్థులపై దాడులు..
ఏపీలో ప్రభుత్వం అనేది ఉందా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని చెప్పారు. ఏడాది కాలంలో అనేక మంది కార్యకర్తలు అధికార పార్టీ దాడులకు బలి అయ్యారని అన్నారు. అయినప్పటికీ.. పార్టీ జెండాను భుజాలు అరిగేలా మోస్తున్నారని ప్రశంసించారు. అలాంటి కార్యకర్తలకు తాను పాదనమస్కారం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు.

రాజీలేని పోరాటం..
సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్లు అనే ఎన్టీ రామారావు స్ఫూర్తితో తాము పని చేస్తున్నామని అన్నారు. ఆత్మగౌరవంతో తాము ముందుకెళ్తున్నామని అన్నారు. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఈ రెండు తెలుగువారి సొత్తు అని చెప్పారు. 38 సంవత్సరాల పాటు రాష్ట్రంలో వినూత్నమైన పాలను అందించామని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్ని రంగాల్లోనూ న్యాయం చేశామని చెప్పారు. పటేల్ పట్వారీ వ్యవస్థలను నిర్మూలించామని అన్నారు.












Click it and Unblock the Notifications