జగన్ క్యాంపు ఆఫీసులో 4 కోట్లతో కరెంటు పనులు, ఫర్నిచర్ - పాత జీవోలతో టీడీపీ సెటైర్లు..
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో పనుల కోసం కేటాయించే డబ్బు విషయంలో ఇప్పటికే పలు వివాదాలు తలెత్తడం, ఆ తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు ఉపసంహరించుకోవడం జరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో గతంలో సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ పనులు, ఫర్నిచర్ కోసం ఏకంగా 4 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను టీడీపీ వెలుగులోకి తెచ్చింది. మాయామహల్లో కరెంటు పనికి నాలుగు కోట్లా అంటూ సెటైర్లు కూడా వేస్తోంది.
జగన్ కు భారీ షాక్..అంతే గట్టిగా రివర్స్ ఎటాక్ - నీటి ప్రాజెక్టులపై వేడి.. తాజా వరదతో టెన్షన్ తగ్గేనా
క్యాంపులో మరో వివాదం...
ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ఆధునీకీకరణ పనుల కోసం గతంలో కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం వాటిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. అప్పట్లో అత్యాధునిక రక్షణ వ్యవస్ధ ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తాజాగా మరోసారి ఇలాంటి వివాదమే మరొకటి వెలుగులోకి వచ్చింది. గతంలో క్యాంపు కార్యాలయంలో విద్యుత్ పనుల కోసం, ఫర్నిచర్ కొనుగోళ్ల కోసం ప్రభుత్వ రెండు వేర్వేరు జీవోల ద్వారా నాలుగు కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ ఉత్తర్వులు టీడీపీ తాజాగా వెలుగులోకి తెచ్చింది. దీంతో క్యాంపు కార్యాలయం ఖర్చులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి.
గతేడాది జీవోలు...
గత ఏడాది అప్పటికే క్యాంపు ఆఫీసులో ఖర్చులపై పలు జీవోలు బయటికి రావడం, వాటిపై విమర్శలు తలెత్తడంతో ప్రభుత్వం మిగిలిన వాటిని రహస్యంగా ఉంచింది. అయితే వీటిని టీడీపీ నేతలు తాజాగా వెలుగులోకి తెచ్చారు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో క్యాంపు ఆఫీసు కరెంటు పనులు, ఫర్నిచర్ కోసం ప్రభుత్వశాఖలు రూ.4 కోట్లు కేటాయించాయి. వీటిని చూపుతూ టీడీపీ నేతలు మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత లోకేష్ జగన్ పదవీ స్వీకార కార్యక్రమం రోజు ఖర్చులపై జీవోలు బయటికితెచ్చి విమర్శలు గుప్పించగా.. ఆయన బాటలోనే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా విమర్శలకు దిగారు.
రూపాయి జీతగాడి సోకులంటూ...
నెలకు రూపాయి మాత్రమే జీతం తీసుకునే సీఎం జగన్ ప్రజాధనంతో క్యాంపు కార్యాలయం కోసం ఇంత భారీ ఖర్చుపెట్టడం అవసరమా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్వీట్లలో విమర్శలు చేశారు. బుద్ధా వెంకన్న అయితే గతంలో లోకేష్ పెట్టిన ట్వీట్ ను కూడా ప్రస్తావిస్తూ మజ్జిగ, మంచినీళ్ల కోసం కోటి, కరెంటు పనులు, ఫర్నిచర్ కోసం నాలుగు కోట్లా అంటూ ప్రశ్నించారు. మంది సొమ్ముతో విలాసాలు ఏంటన్నారు. ఊరికో రాజభవనం నిర్మించుకోవడం మీకు ఫ్యాషన్ అయినా వాటిని నిర్వహించే స్తోమత రాష్ట్ర ప్రజలకు లేదన్నారు. ఒక్క రూపాయి జీతగాడు జగన్ రెడ్డి రాజభవనాల సోకులకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోయేలా లేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తన తాజా ట్వీట్ లో విమర్శించారు.