కేంద్రం స్టీల్ప్లాంట్పై చేతులెందుకు ఎత్తేసిందో చెప్పిన అమర్నాథ్: మళ్లీ టీడీపీ అవిశ్వాసం!
అమరావతి: బయ్యారం, కడప ఉక్కు పరిశ్రమలపై కేంద్రం చేతులెత్తేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పందించారు. ఏపీకి అన్యాయం చేయాలనేదే కేంద్రం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఈ హామీని నెరవేరుస్తానని కేంద్రం చెప్పిందని, కానీ చంద్రబాబును, టీడీపీని దెబ్బతీసేందుకు ఉక్కు పరిశ్రమను ఇవ్వలేమని కేంద్రం చెబుతోందన్నారు.
చదవండి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ షాక్
ఏపీలో అపారమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని, కడపలో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ ఉందని, ఇదే విషయాన్ని రాష్ట్రంలో ఖనిజ సంపదపై సర్వే చేసిన మెకాన్ సంస్థ కూడా వెల్లడించిందన్నారు. అయినప్పటికీ ఏపీకి అన్యాయం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్రం ఖనిజ సంపద లేదని కాకమ్మ కథలు చెబుతోందన్నారు.
ఏపీ బీజేపీ నాయకుల తీరుపై కూడా అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. మొన్నటి వరకు కడప స్టీల్ ప్లాంట్ తెస్తామని చెప్పినవాళ్లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారన్నారు. బీజేపీ నాయకులు చెప్పే మాటలకు, చేసే పనులకు ఏ మాత్రం పొంతన లేదన్నారు. నమ్మించి మోసం చేసిన కేంద్రంపై తాము ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. దానిని మరింత ఉద్ధృతం చేసి కడప స్టీల్ ప్లాంట్తో పాటు విభజన హామీలు నేరవేర్చుకుంటామన్నారు.
మళ్లీ అవిశ్వాసం పెడతాం: సీఎం రమేష్
కడప స్టీల్ ప్లాంట్పై చేతులెత్తేసిన కేంద్రంపై మళ్లీ అవిశ్వాస తీర్మానం పెడతామని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఏపీకి మేలు చేయాలనే ఉద్దేశ్యం కేంద్రానికి లేదన్నారు. హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామా వల్ల ఫలితం లేదన్నారు.
బీజేపీ విశేష్ సంపర్క్ అభియాన్
ఏపీలో విశేష్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ రంగాల్లోని ప్రముఖులతో భేటీలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరంలో కన్నా లక్ష్మీనారాయణ, అనంతపురంలో హరిబాబు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పురంధేశ్వరి, కడప, విశాఖ నగరాల్లో సోము వీర్రాజు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో విష్ణు కుమార్ రాజు పర్యటిస్తారు.
రాజమండ్రిలో కంతేటి సత్యనారాయణ, గుంటూరులో మాజీ మంత్రి మాణిక్యాల రావు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఆకుల సత్యనారాయణ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గోకరాజు రంగరాజు, విజయవాడ, కర్నూలులలో ఎమ్మెల్సీ మాధవ్ పర్యటిస్తారు.