అమరావతిపై సుప్రీంకు జగన్ సర్కార్-టీడీపీ రియాక్షన్ ఇదే
అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఇవాళ వైసీపీ ప్రభుత్వం సవాల్ చేసింది. వాస్తవానికి హైకోర్టు తీర్పు వెలువరించి నెలలు గడుస్తున్నా ఇంతకాలం మౌనంగా ఉన్న ప్రభుత్వం ఉన్నట్లుండి ఇవాళ సవాల్ చేసింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ మండిపడింది.
అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పును వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయడాన్ని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి భంగపాటు తప్పదన్నారు. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా ఆలస్యంచేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు చట్టసభల్ని అవమానించే తీర్పు ఇచ్చిందంటూ ఆరోపించడాన్ని కూడా ఆక్షేపించారు. దురుద్దేశంతోనే హైకోర్టు తీర్పును వక్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కనకమేడల విమర్శించారు.

మరోవైపు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వ పిటిషన్ పై స్పందించారు. హైకోర్టు తరహాలోనే సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి తీర్పు వస్తుందని కేశవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల ఆకాంక్షలను సుప్రీంకోర్టు కూడా కాదనే అవకాశం లేదని కేశవ్ తెలిపారు. అమరావతి రైతుల పోరాటం వృథా పోదన్నారు. రైతుల సంకల్పం ముందు ప్రభుత్వ కుట్రలు చాలా చిన్నవని పీఏసీ ఛైర్మన్ పేర్కొన్నారు. తద్వారా సుప్రీంకోర్టులోనూ హైకోర్టు తీర్పే రిపీట్ అవుతుందనేలా కేశవ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications