రాజధాని రగడ: పవన్పై టిడిపి ఇలా, జగన్పై అలా, ఆస్తి పంచాలని డిమాండ్
హైదరాబాద్: రాజధాని భూసేకరణ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏపీ మంత్రులు... జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజధాని పర్యటన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధర్నా పైన రెండు రోజులుగా స్పందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పైన సానుకూలంగా, జగన్ ధర్నా పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించారు. బలవంతంగా భూమిని లాక్కోవద్దని ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు.
మరోవైపు, బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. బలవంతపు భూసేకరణ చేయవద్దని, తాము అధికారంలోకి వచ్చాక రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు.

అయితే, పవన్ కళ్యాణ్ సమీప భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తిని కనబర్చడం లేదు. పార్టీ పెట్టినందున, ప్రజలకు సమస్యలు వస్తే వచ్చి ప్రశ్నిస్తానని చెప్పినందున ఆయన వస్తున్నారు. పవన్ కళ్యాణ్ రోడ్డెక్కడంలో రాజకీయ ప్రయోజనాలు లేవని టిడిపి భావిస్తోంది.
అదే సమయంలో జగన్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని మండిపడుతోంది.
జగన్ దీక్ష రాజకీయంతో కూడుకున్నదని, అదే సమయంలో పవన్ కళ్యాణ్ టిడిపితో వ్యతిరేకతతో కాకుండా రైతుల పైన ప్రేమతో పర్యటించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం అన్నారు. జగన్ తన అక్రమాస్తులను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
జగన్కు అధికారం పిచ్చిపట్టినట్లుందని, అందుకే అధికారం అంటున్నారని, ఆయనకు పదవి అనే మానసిక వ్యాధి సోకిందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ రైతులపై ప్రేమతో మాట్లాడితే, జగన్ మాత్రం ఎందుకు ధర్నా చేశారో ఎవరికీ అర్థం కాదని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications