నేడు టీడీపీ విస్తృత స్థాయి భేటీ .. పలు కీలక అంశాలపై చర్చ .. భవిష్యత్ కార్యాచరణ
ఏపీలో టిడిపి అధికార వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. తమని తాము రక్షించుకునే క్రమంలో వైసిపి నేతల విమర్శలను తిప్పి కొట్టే పనిలో ఉంది. అందుకోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, బుద్ధా వెంకన్నవంటి నాయకులు తదితరులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అలాగే టిడిపి కార్యకర్తలపై విపరీతంగా దాడులు పెరుగుతున్నాయని, వారికి అండగా ఉండటంతో పాటుగా, పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపే పనిలో ఉంది టీడీపి.

విజయవాడలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం.. పలు కీలకాంశాలపై చర్చ
ఇక తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. విజయవాడలోన ఏవన్ సమావేశ మందిరంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ను నిర్ణయించనున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తదితర అంశాలను ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్ష తో పాటు, ఎన్నికల అనంతరం టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై జరుగుతున్న దాడులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక వైసీపీ దాడులను ఏవిధంగా ఎదుర్కోవాలన్న అంశంపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. అలాగే ఆర్టికల్ 370 రద్దు- కాశ్మీర్ సమస్య తదితర అంశాలను ఈ సమావేశంలో అజెండాగా పెట్టారు.దీనిపైన కూడా చర్చిస్తారు.

భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఏది ఏమైనా గత ఎన్నికల ఓటమితో కుదేలైన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా, పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆందోళనకరమైన వాతావరణంలో టీడీపీ శ్రేణులు ఎవరు భయాందోళనలకు గురి కావద్దని, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎదుర్కునేందుకు అందరూ సన్నద్ధం కావాలని ఈ భేటీ ద్వారా చంద్రబాబు పార్టీ నేతలకు చెప్తారని సమాచారం. వైసీపీ నేతల మూకుమ్మడి దాడి ని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని, అందుకోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని నేటి భేటీలో నిర్ణయించనున్నారు.

సమావేశంపై సర్వత్రా ఆసక్తి .. ఎందరు గైర్హాజరు అవుతారో !
ఇప్పటికే టిడిపి నేతలు పలువురు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి జంప్ అవ్వాలని చూస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం పై ఆసక్తి నెలకొంది. చంద్రబాబు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి నేతల విస్తృత సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారు.. ఎంత మంది గైర్హాజరు అవుతారనేది నేడు తెలియనుంది.
ఇప్పటికే ఏ జిల్లాకు ఆ జిల్లాలో పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఇక దీంతో ఎవరు ప్రధానంగా ఈ భేటీలో పాల్గొంటారనే చర్చ సాగుతుంది. అంతే కాదు వైసీపీపై పోరాటం చెయ్యాలని ఎంతగా చెప్పినా ఇప్పటికీ నోరు విప్పని కీలక నేతలు టీడీపీలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎక్కడ ఏ విమర్శ చేస్తే ఏ కేసులో ఇరికిస్తుందో అన్న ఆందోళనలో ఉన్నారు. అలాంటి నేతలు ఈ భేటీ తర్వాతైనా తమ పంధా మార్చుకుంటారా ? ఈ భేటీతో చంద్రబాబు ఏం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు అనేవి నేడు తెలియనున్నాయి.












Click it and Unblock the Notifications