కంటికి కనపడని శత్రువుతో బయటకు కనపడని యుద్ధం??
రాజకీయాలంటే ఒక పార్టీపై మరో పార్టీ విమర్శించుకోవడం వరకే పరిమితం కావాలి. కేవలం ప్రత్యర్థులుగానే తలపడి ప్రజలచేత ఓట్లు వేయించుకోవాలి.. అధికారంలోకి రావాలి. కానీ దురదృష్ణవశాత్తూ ఏపీ రాజకీయాల్లో ఉన్న పార్టీలు ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా వ్యవహరిస్తుండటం ప్రజాస్వామ్య వాదులకు ఆందోళన కలిగిస్తోంది. రేపు ఏ తీరానికి ఈ నావ చేరుతుందో అనే అభిప్రాయం అందరిలో కలుగుతోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత..
వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాలు అందుబాటులో లేనప్పుడు పత్రికా ప్రకటనలకే పార్టీల యుద్ధం పరిమితమయ్యేది. రాజకీయ పార్టీ నేతలకు మరో పార్టీ నేతలపై ఏవైనా దురభిప్రాయాలున్నా అవి వారిలో వారే వ్యాఖ్యానించుకునే స్థితిలోనే ఉండేవి. అంతకుమించి కట్టు దాటేవి కాదు. కానీ సోషల్ మీడియా పేరుతో ఎప్పుడైతే సోషల్ ఇంజనీరింగ్ ప్రారంభమైందో అప్పటి నుంచి రాజకీయ పార్టీల మధ్య వైరం కాస్తా శత్రుత్వానికి దారితీస్తోంది. బాగా చదువుకొని పదిమందిని ఎడ్యుకేట్ చేసి మంచి దారిలో నడిపించాల్సినవారు కూడా కులాలు, మతాల రొంపిలో చిక్కుకొని తమ వ్యక్తిగత అభిప్రాయాలను పోస్ట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడంతోపాటు వారి వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసుకుంటున్నారు.

ఉద్యోగులను నియమించుకొని మరీ..
సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకొని మరీ రాజకీయ పార్టీలు ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నాయి. పార్టీని వదిలి వ్యక్తుల కుటుంబ సభ్యులమీద, వారి వ్యక్తిగత వ్యవహారాలమీద కామెంట్లు చేయడం ప్రారంభమైంది. స్త్రీ, పురుష బేధం లేకండా పార్టీలన్నీ వ్యవహరిస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీకానీ, ప్రతిపక్షంలోని టీడీపీకానీ పార్టీ ఏదైనా ఒకరిపై మరొకరు డిజిటల్ యుద్ధం చేస్తున్నారు.

జగన్, అచ్చెన్నాయుడు మధ్య ఒప్పందం
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో విమర్శలు ఏమైనా ఉంటే మనం చేసుకుందామని, కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులమీద చేయవద్దని సూచించారు. ఇద్దరూ ఓకే అనుకున్నారు. కానీ అది ఆ సమావేశం వరకే పరిమితమైంది. తర్వాత యథావిధిగా డిజిటల్ యుద్ధం కొనసాగుతోంది. ప్రతి అంశంమీద ఇరు పార్టీలమధ్య గతంలో కూడా జరిగిందికానీ ఇప్పుడు మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు.

చవకబారు రాజకీయం
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చి వైఎస్ పేరు పెట్టిన దగ్గర నుంచి ప్రారంభమై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన తర్వాత మరింత తీవ్రరూపం దాల్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలాంటివాడు? సీనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత్వం ఎలాంటిది? చంద్రబాబు, లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జగన్, భారతి, ఇతర నేతలమీద రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్టీఆర్ అవసరం లేదని చంద్రబాబు ఇంటర్వ్యూను, కర్ణాటక తరహాతో పేటీ సీఎంలా, భారతి పే రుతో పోస్టర్లు వైరల్ చేస్తున్నారు. ఒకరిపై మరొకరు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేసుకుంటున్నారు. వాటిని గ్రూపుల్లో సర్క్యులేట్ చేయించడం జరుగుతోంది. సభ్యత, సంస్కారం లేకుండా చవకబారు రాజకీయం చేస్తున్నారని, చెడువార్తను వైరల్ చేస్తే మైలేజీ వస్తుందనే భావనలోకి పార్టీలన్నీ వెళ్లిపోయాయి.












Click it and Unblock the Notifications