200సీట్లు మావే: యనమల, వైయస్దే టి పాపం: జెపి
రాజమండ్రి/హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 200 సీట్లు రావడం ఖాయమని టిడిపి శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు మంగళవారం అన్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు. ప్రజల్లో టిడిపికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోందన్నారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజనకు నడుంకట్టిన కాంగ్రెసు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పతనమవుతుందన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావం కడప జిల్లాతో పాటు మరో రెండు మూడు జిల్లాల్లోనే ఉందన్నారు. రాష్ట్ర విభజన పాపంలో జగన్కు ప్రమేయం ఉండటం వల్లనే అఫిడవిట్ల నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. అఫిడవిట్లను కోర్టులో వేస్తేనే విలువ ఉంటుందని, జగన్కు ఆ మాత్రం పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు తప్పుల తడకగా ఉందని, అందుకే దానిని వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతిని కోరామన్నారు. బిల్లుపై చర్చించే ముందు ఏదో ఒక తీర్మానం చేయాలన్నారు. ఎలాంటి తీర్మానం లేకుండా చర్చ సరికాదన్నారు.

వైయస్సే నాంది పలికారు: జెపి
రాష్ట్ర విభజనకు నాంది పలికింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డేనని లోక్సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ హైదరాబాదులో అన్నారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల ఆదాయ వ్యయాలు తేల్చకుండా విభజన అసాధ్యమన్నారు. ఆదాయ వ్యయాలపై విస్తృతస్థాయి చర్చ జరగాలన్నారు. సీట్లు, వారసులు, అధికారమే రాజకీయ పార్టీల లక్ష్యమని విమర్శించారు.

అధికారం కోసం పార్టీలు పని చేయవద్దన్నారు. అన్ని ప్రాంతాలకు భవిష్యత్తు చూపే నాయకుడు ఇప్పుడు కావాలన్నారు. ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న ఆందోళన పరిస్థితి తొలగాలన్నారు. తెలంగాణలో భావోద్వేగాలు అపారంగా పెరిగాయని, ఐదేళ్లలో జరిగిన పరిణామాలు అనివార్యమైన పరిస్థితికి దారి తీశాయన్నారు. కోట్లాది ప్రజల జీవితాలు, లక్షల ఉద్యోగుల భవిష్యత్తును ఆలోచించాలని సూచించారు. ప్రజల మనసుల్లోని భావాలను తొలగించడం సాధ్యం కాదన్నారు. సమగ్ర, సామరస్య పరిష్కారాన్ని తాము ఆహ్వానిస్తామన్నారు.












Click it and Unblock the Notifications