కమ్మ కోటల్లో బీసీలకు టికెట్లు: సంప్రదాయానికి భిన్నంగా టీడీపీ
అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సైతం లేకపోలేదు. దీనికి అనుగుణంగా ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు.. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వేలను సైతం నిర్వహిస్తోన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అనే కాన్సెప్ట్తో ఈ సర్వేలను చేపడుతోన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారాన్ని అందుకుంటాయంటూ అంచనా వేస్తోన్నాయి.

ఓటుబ్యాంక్ కోసం..
ఈ పరిణామాల మధ్య ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెడుతోంది. పార్టీకి దూరమైన ఓటుబ్యాంకును ఆకర్షించే పనిలో పడినట్టే కనిపిస్తోంది. ఆవిర్భావం నుంచీ టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తూ వస్తోన్నట్లు భావిస్తోన్న వెనుకబడిన సామాజిక వర్గాలకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చేలా పావులను కదుపుతోంది. బీసీలతో పాటు దళితులు, మైనారిటీలను పార్టీకి చేరువ చేయడానికి అవసరమైన ఎలాంటి కీలక నిర్ణయాలనైనా తీసుకోవడంలో వెనక్కి తగ్గకూడదని భావిస్తోంది.

ఆ ముద్ర చెరివేసుకునే ప్రయత్నం..
ఇందులో భాగంగా- వచ్చే సార్వత్రిక ఎన్నికల టికెట్ల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడి సామాజిక వర్గమైన కమ్మ కులస్తులకు టీడీపీలో ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, పార్టీ అగ్రనాయకత్వం మొదలుకుని కిందిస్థాయి క్యాడర్ వరకు వారిదే పెత్తనం అంతా సాగుతుందనే ముద్రను చెరిపేసుకోవాలనే కృతనిశ్చయంలో ఉందని సమాచారం.

బీసీలకు టికెట్లు..
అగ్రకులాలు- ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గానికి ఇస్తోన్న ప్రాధాన్యతను తగ్గించడం వల్ల ఆ ముద్ర తొలగిపోతుందని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు కాపు సామాజిక వర్గానికీ టికెట్ల కేటాయింపులో సమాన ప్రాతినిథ్యాన్ని ఇచ్చేలా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రణాళిక ఉండబోతోందనే ప్రచారం సాగుతోంది. దీనికి అవసరమైన ఫీడ్బ్యాక్ను పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకుంటోన్నారని తెలుస్తోంది.

ఏఏ నియోజకవర్గాల్లో..
దీని ప్రకారం చూసుకుంటే- సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో ఈ సారి బలమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు లేకపోలేదు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం, గుంటూరు జిల్లా మంగళగిరి, ప్రకాశం జిల్లా చీరాల, కృష్ణాజిల్లా గన్నవరం, అనంతపురం అసెంబ్లీ, లోక్సభ స్థానాలు.. ఇలా ప్రాథమికంగా కొన్నింటిని గుర్తించినట్లు తెలుస్తోంది.

కల్యాణదుర్గంలో బీసీ అభ్యర్థి..
కల్యాణదుర్గంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపడం దాదాపుగా ఖాయమైందని అంటున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన ఓ పారిశ్రామికవేత్తకు టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. అలాగే- మంగళగిరిలో గంజి చిరంజీవి రాజీనామా అనంతరం అక్కడి పరిణామాలు మారిపోయాయి. ఈ సారి నారా లోకేష్ పోటీ చేయకపోవచ్చని, అదే జరిగితే- బీసీ సామాజిక వర్గానికి టికెట్ దాదాపు ఖరారవుతుందని చెబుతున్నారు.

వైసీపీ వైపు..
కాపులు సహా దాదాపు అన్ని సామాజిక వర్గానికి చెందిన ఓటర్లందరూ 2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారనడంలో సందేహాలు అక్కర్లేదు. ఆయా ఓటర్లందరూ మూకుమ్మడిగా ఆకర్షితులు కావడం వల్లే అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ స్థానాలను వైఎస్ఆర్సీపీ దాదాపుగా క్లీన్స్వీప్ చేయగలిగింది. కమ్మ సామాజికవర్గ పార్టీగా పడిన ముద్రను చెరిపేసుకోలేకపోతే 2024 నాటి ఎన్నికల్లోనూ ఇదే పునరావృతమౌతుందని టీడీపీ అంచనా వేస్తోంది. అందుకే- ఇప్పటి నుంచే ఆ దిశగా చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications