ఎంఈవోని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయురాలు...ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి గంటా శ్రీనివాసరావు
మార్కాపురం: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఎంఈవోని టీచర్ చెప్పుతో కొట్టినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. మీడియాలో సైతం ఈ ఘటనపై వార్తలు రావడంతో విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఘటన వివరాలు ఇవి...
ప్రకాశం జిల్లా మార్కాపురం మండల విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న రామ్దాస్నాయక్ గత కొంతకాలంగా మండల పరిధిలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్నాడట. అతని వేధింపులు ఎక్కువైపోవడంతో మంగళవారం భర్తతో కలసి ఎంఈవో ఆఫీసుకు వచ్చిన ఆ టీచర్ భర్త ముందే ఎంఈవోను చెప్పుతో కొట్టిందట.
ఇలా జరిగింది...
ఎంఈవో, టీచర్ మధ్య వాగ్వాదం నేపథ్యంలో ఆ టీచర్ చెప్పుతో కొట్టడంతో ఈ ఘటనను అక్కడ వున్న టీచర్స్ గమనించి ఎంఈవోను పక్కకు తీసుకెళ్లారట. ఆ తరువాత ఈ విషయాన్ని తోటి ఉపాధ్యాయులకు చెప్పారట. అలా ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి ఆ తర్వాత సోషల్ మీడియాకు చేరి వైరల్ గా మారి చివరకు మీడియాలో వార్తలు వచ్చేంతవరకు వెళ్లింది. దీంతో ఈ విషయంపై విద్యా శాఖలో కలకలం రేగడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రాజీ జరిగిందట...
అయితే ఈ ఉదంతం సంచలనం సృష్టించడంతో విద్యాశాఖ పరువు పోకుండేందుకని టీచర్, ఎంఈవోల మధ్య తోటి ఉపాధ్యాయులు రాజీ కురిర్చారట. అందులోను ఆ ఉపాధ్యాయురాలి భర్త కూడా హెడ్ మాస్టర్ కావడంతో సర్థి చెప్పుకొని రాజీ చేశారట.
లేఖ, ఆడియో టేపు విడుదల
ఈ ఘటన ప్రకంపనలు సృష్టించడంతో ఆ తర్వాత కొద్ది గంటలకే ఆ ఉపాధ్యాయురాలు తాను ఎంఈవో ను చెప్పుతో కొట్టలేదని వివరణ ఇస్తూ ఒక లేఖను అదే లేఖలో ఆమె భర్త కూడా వివరణను కూడా పొందుపరుస్తూ లేఖను విడుదల చేశారు. ఆ లేఖతో పాటుగా ఏం జరిగిందో వివరిస్తూ ఆడియో టేపును కూడా విడుదల చెయ్యడం జరిగింది. అయితే ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో స్పందించిన విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అసలు ఏం జరిగిందో తేల్చాలంటూ డిఈవోను విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.