భోగి మంటల్లో పీఆర్సీ రిపోర్ట్- విజయవాడలో ఉపాధ్యాయుల నిరసన-పీఆర్సీ, సీపీఎస్ రద్దు డిమాండ్లు
ఏపీలో వైసీపీ సర్కార్ తాజాగా ప్రకటించిన పీఆర్సీ ఫిట్ మెంట్ శాతంపై ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలోనూ ఉపాధ్యాయ సంఘాల సమితి ఫ్యాప్టో తమ నిరసన తెలిపింది. పీఆర్సీ నివేదిక కాపీల్ని 0ఉపాధ్యాయులు భోగిమంటల్లో వేసి తగులబెట్టారు.
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ నివేదిక అసంబద్ధంగా ఉందని ఆరోపిస్తున్న ఉపాధ్యాయులు... ఫ్యాప్టో పిలుపు మేరకు ఇవాళ రిపోర్ట్ కాపీల్ని భోగి మంటల్లో వేసి దగ్దం చేశారు. అసంబద్ధ పిఆర్సీ రద్దు చేయాలని ఫ్యాప్టో మాజీ ఛైర్మన్ పి.బాబురెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని ఆయన కోరారు. పీఆర్సీపై వాస్తవంగా ప్రభుత్వానికి అందిన అశుతోష్ మిశ్రా రిపోర్ట్ బహిర్గతం చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేసారు.
అలాగే ఇకపై రాష్ట్ర పీఆర్సీ స్ధానంలో కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ అమలు చేయాలన్న ప్రతిపాదన కూడా విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వం హెచ్ ఆర్ ఏ పైనా వెనక్కి తగ్గాలని, పాత హెచ్. ఆర్ .ఏ రేట్లు కొనసాగించాలని ఈ నిరసనల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులను మాస్టర్ స్కేల్ పరిధిలోకి తీసుకుని రావాలని కోరారు.
రాష్ట్రంలో ప్రభుత్వం తాజాగా అంగీకరించిన 23 శాతం ఫిట్ మెంట్ పై ఉపాధ్యాయులతో పాటు వివిధ రంగాల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కూడా పీఆర్సీ ఫిట్ మెంట్ తమకు ఆమోదయోగ్యంకాదని ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చింది.
హెచ్ఆర్ఏ విధానంలో మార్పులు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు వంటి సమస్యలు ఉండనే ఉన్నాయి. వీటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది.